తీర్పును గౌరవిస్తున్నా .. జనంలోనే ఉంటానన్న నారా లోకేష్ .. ఓటమిపై స్పందన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఓటమి పాలయ్యారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర ఓటమి చవి చూసారు . ఇక తాను ఓటమి పాలవ్వడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. శాసనసభ అభ్యర్థిగా తాను పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్న నారా లోకేష్ ఇవేవీ ప్రజా సేవకు ఆటంకం కావన్నారు. ఇక ముందు కూడా ప్రజల్లో ఉంటాను, ప్రజల కోసం పనిచేస్తానంటూ ట్వీట్ చేశారు. నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఓటమిపాలయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన నారా లోకేష్ మంగళగిరి నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ జెండా ఎగురవెయ్యాలని విఫలయత్నం చేశారు.
బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!
లోకేష్ సీఎం చంద్రబాబు తనయుడు కావటంతో అక్కడ విజయం సునాయాసంగా సాధ్యం అవుతుందని భావించారు.కానీ అలా జరగలేదు. నారా లోకేష్ అనూహ్యరీతిలో తన సమీప ప్రత్యర్థి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి 5, 200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.