జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ.. జగన్ను చూసే అలా పెట్టారేమో : నారా లోకేష్ సెటైర్స్..
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో జపాన్కు చెందిన ప్రముఖ టోరె ఇండస్ట్రీస్ అనుబంధ పరిశ్రమ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్దిసేపటికే మాజీ మంత్రి,టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్లో దీనిపై విమర్శలు గుప్పించారు. జరగాలి పెళ్లి.. మళ్లీ మళ్లీ అనే కాన్సెప్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసే పెట్టారేమోనని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలోనే శ్రీసిటీలో టోరె ఇండస్ట్రీస్ పరిశ్రమకు శిలాఫకాన్ని కూడా ఆవిష్కరించామని అప్పటి పేపర్ క్లిప్పింగ్స్ను ట్విట్టర్లో పోస్టు చేశారు.
కియా మోటార్స్ విషయంలో మంత్రి బుగ్గన అసెంబ్లీలో లెటర్ చదువుతూ.. అధ్యక్ష అంటూ బుర్ర కథ వినిపించారని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే కష్టపడి తీసుకొచ్చిన టీసీఎల్ని కూడా తమ ఖాతాలోనే వేసుకున్నారని,ఇప్పుడు టోరె వంతు వచ్చిందని అన్నారు. టోరె కంపెనీ కోసం చంద్రబాబు ఎంతో కష్టపడి ఫాలో అప్ చేసి తీసుకొచ్చారని చెప్పారు. టీడీపీ హయాంలోనే భూమి పూజ అయిపోయిన కంపెనీ,అప్పుడే బిల్డింగ్ కూడా రెడీ అయిపోయిన కంపెనీని.. ఇప్పుడు తామే తెచ్చినట్టు వైసీపీ హడావుడి చేస్తోందన్నారు. ఎంతో కష్టపడి తీసుకొచ్చిన టోరె కంపెనీని కియా మోటార్స్ని బెదిరించినట్టు బెదరగొట్టి తరిమేయకండి అని లోకేష్ విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉంటే, ఏపీకి మరో భారి పరిశ్రమ రాబోతుందంటూ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి శుక్రవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఒహియోలోని కొలంబస్ కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్ ఆటో ఫైనాన్షియల్ కార్పోరేషన్ సంస్థ ఏపీలోని విశాఖపట్నంలో ఐటీ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.