ఎన్టీఆర్ బయోపిక్పై వర్మకు నారా లోకేష్ షాక్: బీర్ వ్యాఖ్యలపై కామెంట్స్
ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ మంత్రి, ఎన్టీ రామారావు మనవడు నారా లోకేష్ షాక్ ఇచ్చారు.
విజయవాడ: ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ మంత్రి, ఎన్టీ రామారావు మనవడు నారా లోకేష్ షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ బయోపిక్కు దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మను తాము అనుకోలేదని నారా లోకేష్ చెప్పారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనే విషయాన్ని పోర్చుగల్ పర్యటనలో తాము అనుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య అయితేనే సరిపోతారని తెలిపారు.
దర్శకుడు ఎవరైనా సరే బాలయ్య ఉంటే సినిమా హిట్ అవుతుందని అన్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మను ఇంకా అనుకోలేదని చెప్పారు. బీర్ హెల్త్ డ్రింక్ అన్న మంత్రి జవహర్ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు.
రామ్ గోపాల్ వర్మ
దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని వర్మ తెలిపారు. ఎన్టీఆర్ నాశనాన్ని ఎవరు కోరుకున్నారు, ఆయన వెనక జరిగిన కుట్రలు సినిమాలో ఉంటాయని ఆయన చెప్పారు.
జవహర్ వ్యాఖ్యలపై.
బీర్ హెల్త్ డ్రింక్ అన్న మంత్రి జవహర్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పుగా ప్రచారం చేస్తోందనినారా లోకేష్ అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జవహర్ వ్యాఖ్యలపై వైసిపి ఎమ్మెల్యే రోజా విరుచుకుపడిన విషయం తెలిసిందే.
ఆ భూమి కొనాల్సిందే...
కోర్టు తీర్పు ప్రకారం ఐదు కోట్ల రూపాయలు అదనంగా చెల్లించి ఆళ్ల రామకృష్ణారెడ్డి కొనాల్సిందేనని నారా లోకేష్ అన్నారు. సదావర్తి భూములపై అదనంగా ఐదు కోట్ల రూపాయలు చెల్లించి ఆ భూములను తీసుకోవడానికి ఆళ్ల రామకృష్ణా రెడ్డికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు రామకృష్ణా రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు.
వైట్ మనీ లేదంటున్నారు...
సదావర్తి బూములకు అంత వైట్ మనీ లేదంటున్నారని, అంటే బ్లాక్ మనీ ఉందనేగా అర్ధమని లోకేష్ అన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి బినామీ పేర్లతో కొనుగోలు చేస్తే ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వేలంలో భూములు కొనకుండా కోర్టుకు వెళ్లారని లోకేష్ అన్నారు.