'అందుకే టీఆర్ఎస్ మాటలు ఏపీ ప్రజలు నమ్మరు, కాంగ్రెస్-టీడీపీ వేరుగా పోటీ చేసి.. కలుస్తాయా?'
అమరావతి/దావోస్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మరోసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. దావోస్లో ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలవి కుమ్మక్కు రాజకీయాలని ఆయన విమర్శించారు. వారి మాటలు ప్రజలు నమ్మరని చెప్పారు.
బాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్! కుండబద్దలు.. పార్టీల్లో కలకలం
అందుకే టీఆర్ఎస్ మాటలు ఏపీ ప్రజలు నమ్మరు
ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ సహకరించలేదని, కానీ తన ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై పల్లెత్తు మాట అనలేదని లోకేష్ అన్నారు. ఏపీకి సహకరించని టీఆర్ఎస్ మాటలను ఏపీ ప్రజలు ఏమాత్రం విశ్వసించరని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు, కేసీఆర్తో కలిసి జగన్ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనించారని చెప్పారు. విభజన తర్వాత ఏపీకి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.
బీజేపీని ఓడించడమే లక్ష్యం
వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని లోకేష్ చెప్పారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పారు. కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకు చంద్రబాబు సేవలు ఎంతో అవసరమని చెప్పారు. ఆయన ప్రధానిగా వెళ్లాలని కోరుకోవడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలనకు కూడా కుట్ర పన్నారని ఆరోపించారు.
టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేసి కేంద్రంలో కలుస్తాయా అంటే?
పార్లమెంటు సీట్లకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి.. విపక్షాలు గెలిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కలిసి పని చేస్తాయా అనే అంశంపై ఇప్పుడే మాట్లాడలేమని నారా లోకేష్ స్పష్టం చేశారు. దానిపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.