ఇదేం రాజ్యం?: మూడు గ్రామాలకు రాకపోకలు బంద్, రిక్షాలో కరోనా మృతుడి తరలింపు!
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ రౌడీ రాజ్యంలో ప్రజలకు రక్షణ లేదంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ రౌడీ రాజ్యంలో.. మూడు గ్రామాలకు రాకపోకలు బంద్..
‘రౌడీ రాజ్యంలో ప్రజలకు రక్షణ లేదు. రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడం చూసాం, ఇప్పుడు ఏకంగా ట్రాక్టర్ అడ్డుపెట్టి, మట్టి పోసి మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ చేసారు వైకాపా నాయకులు. అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి గ్రామంలో భూవివాదంలో సహకరించలేదు అని గ్రామస్తులపై కక్షకట్టి అధికార పార్టీ నాయకులు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, వెంటనే గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించాలి' అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా మూర్ఖత్వం వదిలి.. మానవత్వంతో..
‘అమరావతిని శ్మశానం అంటూ రాక్షస ఆనందం పొందారు వైకాపా నాయకులు. ఇప్పుడు అమరాతిని నిజంగానే శ్మశానం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్. రాజధానికి 95 సెంట్లు భూమి ఇచ్చి 240 రోజుల నుంచి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతు నాగేంద్రమ్మ మృతి చెందటం బాధాకరం. మూడు ముక్కలాటతో 82 మంది రైతుల్ని బలిగొన్నారు. ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి జగన్ రెడ్డి మానవత్వంతో ఆలోచించాలి' అని లోకేష్ అన్నారు.
గిరిజన యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు..
‘జగన్ భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ, మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి 23 మందిని గాయపర్చారు. గిరిజన యువకుడు డబ్బా బాబ్లీని అత్యంత కిరాతకంగా హత్యచేసారు. గిరిజన మహిళని అప్పు తీర్చలేదంటూ వైకాపా నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడు. అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని వెంటనే దళితులు, గిరిజన కుటుంబాలకు అందజేయ్యాలి. డబ్బా బాబ్లీ ని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి' అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
రిక్షాలో కరోనా మృతదేహాన్ని తరలిస్తారా? 108 అంబులెన్స్లు ఎక్కడ?
‘గుంటూరు జిల్లా బాపట్లలో కరోనాతో మరణించిన 68ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి.. సైకిల్ రిక్షాలో స్మశాన వాటికకు తరలించారు. అయితే, 108 అంబులెన్స్లు ఏమయ్యాయి? ప్రోటోకాల్కు విరుద్ధంగా కరోనా మృతుల తరలింపు జరుగుతోంది. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం' అని నారా లోకేష్ జగన్ సర్కారుపై మండిపడ్డారు.