కంది పప్పు ధరలపై నారా లోకేశ్ ఫైర్.. రఘురామ స్టైల్లో ‘యుశ్రారైకాపా’.. కొవ్వెక్కిదంటూ రోజా కౌంటర్..
రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుండటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా కంది పప్పుపై ఒకే సారి రూ.27 పెంచడాన్ని ఆయన తప్పుపట్టారు. సీఎం జగన్ తీరును ఈ మేరకు ప్రశ్నించిన ఆయన.. ఎంపీ రఘురామకృష్ణంరాజు తరహాలో వైసీపీని కొత్తగా అభివర్ణించారు. కాగా, మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ లోకేశ్ వైసీపీని విమర్శించడమేంటంటూ ఎమ్మెల్యే రోజా ఘాటుగా ఫైరయ్యారు..
జగన్ వల్ల దేశానికి చెడ్డపేరు రావొద్దు.. నిర్మలా సీతారామన్ షాకింగ్ కామెంట్స్.. ఏపీకి భారీగా నిధులు..
రూ.600 కోట్ల భారం..
‘‘కంది పప్పుపై కిలోకు రూ.27, పంచదార కిలోకు రూ.14 ఒకేసారి పెంచేశారు. దీనివల్ల ఒక ఏడాదిలో పేదలపై రూ.600 కోట్ల అదనపు భారం పడుతుంది. కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాగేసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటైన పని. జగన్ రివర్స్ టెండర్ ముఖ్యమంత్రి కాబట్టే పేదలకు ఇచ్చే రేషన్ సరుకుల ధరలను భారీగా పెంచారు'' అని లోకేశ్ మండిపడ్డారు.
యుశ్రారైకాపా అంటూ ఎద్దేవా..
సాధారణంగా చంద్రబాబు, నారా లోకేశ్ సహా టీడీపీ నేతలందరూ అధికార పార్టీ పేరును ప్రస్తావించినప్పుడల్లా ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైకాపా)''గా పేర్కొంటారు. కానీ ఆదివారంనాటి ట్వీట్ లో మాత్రం వైసీపీని లోకేశ్ కొత్తగా ‘‘యుశ్రారైకాపా'' అని సంబోధించారు. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన దరిమిలా పార్టీ పేరుపై వివాదం నెలకొనడం తెలిసిందే. తాను యువజన శ్రామిక రైతు పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. షోకాజ్ నోటీసులు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో జారీ చేశారని, ఒక ప్రాంతీయ పార్టీకి విజయసాయిరెడ్డి జాతీయ కార్యదర్శిగా ఎలా ఉంటారంటూ రఘురామ అభ్యంతర వ్యక్తం చేశారు. ఈ వివాదం కొనసాగుతోన్న నేపథ్యంలో ఇప్పుడు లోకేశ్.. వైసీపీని పూర్తి పేరుతో.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (యుశ్రారైకాపా) అని పేర్కొనడం గమనార్హం.
జగన్కు మరో షాక్.. వైసీపీ గుర్తింపు రద్దుకు ఈసీకి YSRకాంగ్రెస్ ఫిర్యాదు.. రఘురామ ఎపిసొడ్లో ట్విస్ట్
తిన్నది అరక్కే విమర్శలు..
జగన్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోన్న టీడీపీ నేత నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. తిన్నది అరగక, పనీపాట లేకుండా లోకేశ్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె, ఆలయం వెలువపల మీడియాతో మాట్లాడారు. మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ నారా లోకేశ్ అని దుయ్యబట్టారు.
అప్పుడు దాక్కొని.. ఇప్పుడు పరామర్శలా..
కరోనా కరోనా సమయంలో ఏపీలోనే ఉండి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిందిపోయి, చంద్రబాబు, లోకేశ్ లు హైదరాబాద్ లో దాక్కున్నారని, అక్కడ కూడా పనీపాట లేక పబ్జీ ఆడుకుంటూ లోకేశ్ టైంపాస్ చేశాడని, ఇప్పుడేమో అరెస్టయిన అవినీతిపరులకు పరామర్శలంటూ పరుగులు తీస్తున్నారని రోజా విమర్శించారు. లోకేశ్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో ఆమె ఈ కామెంట్లు చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం రూ.3లక్షల కోట్ల అప్పులపాలైందని, సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దుతున్నారని, పదవిలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిన వ్యక్తి జగన్ ఒక్కరేనని రోజా అన్నారు. ఇదిలా ఉంటే..
ఎవరికో పుట్టిన బిడ్డకు తండ్రి..
ప్రతిష్టాత్మక అపోలో టైర్స్ కంపెనీ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైన సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరు వద్ద నెలకొల్పిన ఈ ప్లాంటు.. సీఎం జగన్ కృషి వల్లే సాధ్యమైందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పుకోడాన్ని టీడీపీ నేతలు తప్పు పట్టారు. అది చంద్రబాబు హయాంలో ఏర్పాటైన సంస్థ అని స్పష్టం చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డకి తండ్రి జగన్ అని చెప్పడానికి సాయిరెడ్డి తెగ కష్టపడుతున్నారని, తెలుగులో చెబితే జనం ఉమ్మేస్తారనే ఎంపీ ఇంగ్లీషులో ట్వీట్ పెట్టారని, కంపెనీలు తేవడం భవనాలకు రంగులు పూసినంత ఈజీ కాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.