వైసీపీ ఎమ్మెల్యేల వాట్సాప్ గ్రూప్లో అచారకం.. ధ్వంసరచనకు డీజీపీ సహకారం: లోకేశ్ ఫైర్.. కొత్త శపథం
తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో దారుణంగా అవమానించడంపై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పర్మిషన్ ఇచ్చిన పోలీసులే పబ్లిక్ న్యూసెన్స్ కింద అరెస్టు చేయడమేంటని వాపోయారు. వైసీపీ పెయిడ్ ఆర్డిస్టులకు పోలీసులు అండగా నిలిచారని, డీజీపీ సహకారంతోనే రౌడీలు రెచ్చిపోయారని ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన లోకేశ్.. చంద్రబాబు విశాఖ పర్యటనపై మరో సంచలన ప్రకటన చేశారు.
ఎక్కడ అడ్డుకున్నారో.. అక్కణ్నుంచే..
‘ఒక రాష్ట్రం-ఒక రాజధాని' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు వైసీపీ సర్కారు విధానాల్ని ఎండగట్టేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు తలపెట్టిన ‘ప్రజా చైతన్య యాత్ర'లో భాగంగా గురువారం విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో భూములు కోల్పోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. విశాఖ ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్టు చేశారు. వందల సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఎయిర్ పోర్టును దిగ్భందించి, బాబుకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన నేపత్యంలో పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారు. అయితే చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం ఎక్కడైతే అడ్డుకుందో.. మళ్లీ అక్కడి నుంచే యాత్ర ప్రారంభించితీరుతామని లోకేశ్ శపథం చేశారు.
వాట్సాప్ గ్రూపుల్లో ఆదేశాలు..
‘‘చంద్రబాబుపై కోడిగుడ్లు, చెప్పులతో దాడి చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తమ వాట్సాప్ గ్రూపుల్లో అరాచకాన్ని వ్యాపింపజేశారు. నిజానికి వాళ్లు రౌడీల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొద్దిరోజులుగా మా అధినేత ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ప్రజా చైతన్య యాత్ర ప్రశాంతంగా చేశారు. కానీ విశాఖపట్నంలోనే శాంతిభద్రతల సమస్య ఎందుకొచ్చింది? చంద్రబాబు హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే.. జగన్ పాలనలో ఫ్యాక్షనిజం వికేంద్రీకరణ జరుగుతోంది. విశాఖ ఎయిర్ పోర్టులో రచ్చకు దిగింది వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు, కిరాయిమూకలే'' అని లోకేశ్ ఫైరయ్యారు.
డీజీపీడైరెకక్షన్ లో హింస..
విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర గొడవ చేసింది కేవలం 300 మంది వైసీపీ గుండాలేనని, కనీసం అంతమందిని కూడా కంట్రోల్ చేయలేని స్థితిలో పోలీసులు ఉండటం విడ్డూరమని లోకేశ్ వాపోయారు. అయితే వైసీపీ రౌడీలను స్వయంగా డీజీపీనే ప్రోత్సహించారని, కిరాయి మూకలకు పోలీసులు సహకరించారని ఆరోపించారు.
Recommended Video
అధికారంలోకి రాగానే..
విశాఖలో చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా అవమానించిన ప్రతి అధికారిని, వ్యక్తిని గుర్తుపెట్టుకుంటామని, టీడీపీ అధికారంలోకి రాగానే వాళ్లందరిపైనా చర్యలు తీసుకుంటామని లోకేశ్ హెచ్చరించారు. తుగ్లక్ జగన్ పాలనలో ఏపీకి చెందిన పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతున్నాయన్న టీడీపీ నేత.. రాష్ట్రాన్ని వైసీపీ కబందహస్తాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు.