జగన్ చేసేవి దొంగపనులు.. అందుకే, ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు: లోకేష్ ఫైర్
అమరావతి: రాజధాని అమరావతి కోసం జరుగుతున్న రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేననీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతులను జగన్ చంపేస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
అసెంబ్లీ ముట్డడిస్తాం: వైసీపీ ఇక బంగాళాఖాతంలోకే: చంద్రబాబు ఏకిపారేశారు
రైతులను బలితీసుకుంటున్నారు..
అక్రమ కేసులతో ప్రభుత్వం రైతులను బలి తీసుకుంటుందని నారా లోకేష్ ఆరోపించారు. శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కుమారుడు, కోడలిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడంతో రైతు అబ్బూరి అప్పారావు మృతి చెందారని, మహిళా రైతు సామ్రాజ్యమ్మ గుండెపోటుతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని తెలిపారు.
చేసేవి దొంగ పనులు కాబట్టే..
రాష్ట్రం అభివృద్ధి కోసం త్యాగం చేసిన రైతులకు ఈ పరిస్థితి రావడం దారుణమని అన్నారు. చేసేవి దొంగ పనులు కాబట్టే గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారని ఆక్షేపించారు. ప్రజల మధ్యలోంచి కాకుండా జగన్ దొంగ దారిలో వెళ్లడానికి కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని లోకేష్ విమర్శించారు.
అభివృద్ధి చేతకాక ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు..
‘ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజలు ఒక వైపు, వైఎస్ జగన్ గారు మరో వైపు అని తేలిపోయింది. ప్రజలంతా రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్నారు. జగన్ గారు మాత్రం రాజధానిని మూడు ముక్కలు చేస్తా అంటున్నారు. అభివృద్ధి చెయ్యడం చేతగాక రాజధాని విభజన పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు' అని లోకేష్ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిరంకుశత్వ ధోరణి మార్చుకోవాలి. రాజధాని విభజన పక్కన పెట్టి అభివృద్ధి వికేంద్రీకరణ పై దృష్టి పెట్టాలని లోకేష్ హితవు పలికారు.
అమరావతిపై ప్రజాబ్యాలెట్..
కాగా, గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతపై ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను బ్యాలెట్లో భద్రపర్చారు. ఆదివారం సాయంత్రం బ్యాలెట్ పత్రాలను పరిశీలించనున్నారు. అమరావతికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ఓట్లను ప్రకటిస్తారు. రాజధాని అమరావతి కోసం గత 33 రోజులుగా ఈ ప్రాంత రైతులు, మహిళలు, ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో అమరావతిపై ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నారు.