వైసీపీ మైనింగ్ మాఫియా.. ఎన్జీటీ విచారణతో జగన్ రెడ్డి అండ్ కో, ఆ అధికారులకు చిప్పకూడే : నారా లోకేష్
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ జరుగుతున్న రగడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కొత్త మలుపు తిరిగింది. తెలుగుదేశం పార్టీ దీనిని తమ పోరాట ఫలితంగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే అధికార వైసీపీ మాత్రం గతంలోనూ లేటరైట్ గనుల తవ్వకాలకు చంద్రబాబు హయాంలో అనుమతిని ఇచ్చారని, ఇప్పుడు కూడా లేటరైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చామని, బాక్సైట్ తవ్వకాలు జరపడం లేదని తేల్చి చెప్తుంది.
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఎన్జీటీ విచారణ కమిటీ .. తమ పోరాట ఫలితమేనంటున్న టీడీపీ
విశాఖ మన్యంలో మైనింగ్ అక్రమాలపై ఎన్జీటీ విచారణ కమిటీ
ఇదిలా ఉంటే నిన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల పిటిషన్ పై విచారణ జరిపి అక్రమ మైనింగ్ జరుగుతుందని గుర్తించి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కొండ్లు మరీదయ్య పేరుతో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం ఈమేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ మన్యంలో మైనింగ్ పేరుతో అక్రమాలు జరిగాయని ఎన్జీటీ నిర్ధారణకు వచ్చింది. వేల సంఖ్యలో చెట్లను కూల్చి రోడ్లు వేయడాన్ని తీవ్రంగా పరిగణించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమర్పించాలని ఆదేశించింది.
వైసిపి మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయన్న లోకేష్
ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో వైసిపి మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి అంటూ మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటి బయటపడుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న వైయస్ జగన్ బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. గిరిజనుల గుండెలపై గునపం దించిన జగన్ రెడ్డి పాపం పండే రోజులు అతి దగ్గరలో ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Recommended Video
ఆధారాలతో బయట పెడతాం .. ఊచలు లెక్కపెట్టిస్తాం
బాక్సైట్ కోసం తప్పులపై తప్పులు చేసిన జగన్ రెడ్డి అండ్ కో, మన్యంలో అక్రమ మైనింగ్ కు సహకరించిన అధికారులు కూడా ఈసారి చిప్పకూడు తినడం ఖాయం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియా చేస్తున్న అరాచకాలు, దోచుకుంటున్న సంపదకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయట పెట్టి అక్రమార్కులతో ఊచలు లెక్క పెట్టిస్తామని లోకేష్ హెచ్చరించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మన్యం కేంద్రంగా బాక్సైట్ తవ్వకాలపై గత కొంత కాలం నుండి టిడిపి, వైసిపి మధ్య చోటు చేసుకున్న రగడ ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టే దాకా వెళ్ళింది.