చింతమనేని వీడియో: చప్పట్లు ఎలా కొట్టారు.. సూపర్ లాజిక్ లాగిన నారా లోకేష్!
అమరావతి: దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో అంశం వివాదం కావడంపై మంత్రి నారా లోకేష్ గురువారం తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన లాజిక్ కూడా లాగారు. చింతమనేని ప్రసంగాన్ని కొందరు ఎడిట్ చేసి, కొద్ది భాగాన్నే సోషల్ మీడియాలో వైరల్ చేశారని, ఇలా వైసీపీయే తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు.
మరి చప్పట్లు, కేరింతలు ఎందుకు కొట్టారు?
జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపిండటం లేదో చెప్పాలని నిలదీశారు. ఆయన ప్రసంగం వింటూ అక్కడకు వచ్చిన వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారని, అలాంటి మాటలు అంటు ఎవరైనా అలా చప్పట్లు కొడతారా అని ప్రశ్నించారు. తమపై అలా తీవ్రవ్యాఖ్యలు చేస్తుంటే ఆ విధంగా ఎవరైనా చేస్తారా తెలుసుకోవాలని చెప్పారు.
జగన్ పైన ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ పైన కులముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. పదేపదే కుల ప్రస్తావన తెస్తూ ఏపీని అస్థిరపరచాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వం అవుతుందని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రజలకు వారి కుట్రలు అర్థమైన రోజున చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.
రాజకీయం చేస్తున్నారు
జగన్, వైసీపీ నేతలు పదేపదే టీడీపీపై కులముద్ర వేసి రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని లోకేష్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలకు ఏపీ అభివృద్ధి కావడం ఇష్టం లేదని, ఈ కుట్రలో వారి పాత్ర కూడా ఉందని అర్థమవుతోందన్నారు. కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనను కూడా కులాలకు ఆపాదించి రాజకీయం చేస్తున్నారన్నారు.