ఏపీ వెలిగిపోతోందా?, కాంగ్రెస్ పరిస్థితే: కేంద్రం, బీజేపీపై లోకేష్ ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కేంద్రం, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విభజన వల్ల ఏపీ వెలిగిపోతోందని బీజేపీ నేతలు అనడం దారుణమని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని తెలిసి కూడా.. సాయం అందించడం లేదని మండిపడ్డారు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
ప్రజల్లో ఉన్న ఆందోళనలను అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పలితం లేకుండా పోయిందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
న్యాయం చేయమంటే ఎదురుదాడా?
ఏపీ గురించి ఒక్క క్షణం ఆలోచించడానికి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమయం చిక్కడం లేదా? అని మంత్రి ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని కోరితే ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.
ప్రజల్ని మోసం.. కాంగ్రెస్ లానే..
ఏపీ ప్రజల్ని మోసం చేసి ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిందని, అదే బాటలో నడుస్తున్న బీజేపీకి కూడా ఆ పరిస్థితులు తప్పవని నారా లోకేష్ తేల్చి చెప్పారు.
ఆ అవసరం నాకు లేదు
అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అలాగే తన శాఖలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడం లేదని తెలిపారు. తన కుటుంబం పాలు, కూరగాయలు అమ్మి డబ్బు సంపాదిస్తోందని.. చివరికి తన క్రెడిట్ కార్డు బిల్లు కూడా వారే కడతారని చెప్పారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
తన శాఖలో అవినీతి జరుగుతున్నట్లు ఆధారాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటానని లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో తాగునీటి ట్యాంకర్లలో అవినీతి జరుగుతోందని బీజేపీ పక్షనేత సోము వీర్రాజు ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేశ్ పైవిధంగా స్పందించారు.