మోడీజీ! మేమంటే ఎందుకంత చులకన? ‘తెలుగు’పైనా వివక్షేనా?: లోకేష్
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ 'తెలుగు'వారిపై వివక్ష చూపిస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగుకు స్టాట్యూట్ ఆఫ్ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం తెలుగు బిడ్డగా తన మనసు క్షోభిస్తోందని మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్కు వెళ్లాలంటే వీసా కావాల్సి వచ్చేది, ఈరోజు మర్చిపోలేరు: పటేల్ విగ్రహావిష్కరణలో మోడీ
ఇలాంటి విషయాల్లో కూడా తెలుగువారంటే కేంద్రానికి ఇంత వివక్షా? అని నారా లోకేష్ నిలదీశారు. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేయాల్సిన తరుణమిదని అన్నారు.
ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చెయ్యడంలో మోడీ జీ సఫలీకృతం అయ్యారు. కానీ పటేల్ సమైక్య స్ఫూర్తి ని కాపాడటంలో మోడీ విఫలం అయ్యారు. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని బీజేపీ మరో సారి దెబ్బతీసింది. #StatueOfUnity pic.twitter.com/e8odb2WAOP
— Lokesh Nara (@naralokesh) November 1, 2018
ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నరేంద్ర మోడీ సఫలీకృతం అయ్యారు.. కానీ, పటేల్ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు.
ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించడం ద్వారా బీజేపీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి దెబ్బతీసిందని లోకేశ్ ఆక్షేపించారు. కాగా, సర్దార్ పటేల్ విగ్రహం వద్ద దక్షిణాది నుంచి తమిళ భాష తప్ప వేరే భాషకు చోటు కల్పించకపోవడం గమనార్హం.