జగన్ జీతం రూపాయే కానీ, ఆయన ఇంటి తలుపులకేమో రూ. 73లక్షలు: ట్వీటేసిన లోకేష్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటున్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి.. తన ఇంటి కిటికీల కోసం మాత్రం రూ. 73 లక్షల ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు.
జగన్ జీతం రూపాయే.. కానీ..
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నామామాత్రమే తన జీతం అంటూ రాష్ట్ర ప్రజలను వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి అల్యూమినియం తలుపులు, కిటికీల ఏర్పాటు కోసం రూ. 73లక్షల కేటాయిస్తూ సర్కారు జారీ చేసిన జీవోను జత చేసి ట్వీట్ చేశారు లోకేష్.
మీ అసమర్థ.. అహంకారంతో..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థ, అహంకార పోకడలతో రిలయన్స్, అదానీలాంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు కూడా బై బై ఏపీ అంటూ ఒకదాని వెంట ఒకటి రాష్ట్రం విడిచిపోతున్నాయని లోకేష్ తెలిపారు. ఆ సంస్థల వెంటపడి.. ఒప్పించి ఏపీకి తేవడానికి తాము పడిన కష్టమంతా ఇలా బూడిదలో పోసిన పన్నీరవుతుంటే బాధగా ఉందంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటేసిన పాపానికి చావు ముందు నిలబెడతారా?
వైఎస్ జగన్ ఐదు నెలల పాలనలోనే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయని.. ఇక ఐదేళ్లలో ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని ప్రజలు అంటున్నారని లోకేష్ ట్విట్టర్లో విమర్శించారు. మిమ్మల్ని నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలను ఇలాచావు ముందు నిలబెడతారా? అని ప్రశ్నించారు. ప్రజలను ఇన్ని రకాలుగా బాధ పెడుతూ మీకెలా నిద్రపడుతోంది? కాస్తయినా మానవత్వం ఉండాలిగా అని లోకేష్ అన్నారు.
డిప్ప గవర్నమెంటు... డిప్పగొరిగి..
‘రివర్స్ రివర్స్ అంటూ ఈ డిప్ప గవర్నమెంట్ చివరకు చిప్ప మిగిల్చేట్టు ఉంది. ఒక పక్క 628 కోట్లు ఆదా చేసాం అని చెప్పుకుంటూ మరో పక్క ఇసుక ఖర్చు పెరిగింది అని 500 కోట్లు చెల్లించడం చూస్తుంటే డిప్ప గొరిగి విగ్గు పెట్టి మళ్ళీ గొరిగినట్టు ఉంది' అని నారా లోకేష్ సెటైర్లు వేశారు.