నాకు-మా నాన్నకు మధ్య గొడవ పెడతారా, ఆ ఫోటో వెనుక జగన్ భారీ కుట్ర: లోకేష్
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి పత్రిక తనకు, తన తండ్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్య కూడా గొడవ పెట్టే ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు ఆన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో కుటుంబ ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు.
హోంమంత్రి చినరాజప్ప ఫోటో, తెలంగాణలో టిడిపి పరిస్థితి, ఆస్తుల ఆరోపణలు, పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే అంశం, తనకు మంత్రి పదవి, 2019 ఎన్నికల్లో తన పోటీ.. ఇలా పలు అంశాల పైన ఆయన స్పందించారు. అంతేకాదు, చినరాజప్ప ఫోటో విషయంలో వైసిపి భారీ కుట్రకు పాల్పడినట్లుగా కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చినరాజప్ప ఫోటోతో రెండు కులాల మధ్య చిచ్చుకు కుట్ర
టిడిపి పార్టీ సమావేశంలో తాను వేదిక పైన ఉండటం, చినరాజప్ప వేదిక కింద నిలబడిన ఫోటోను వైసిపి రాజకీయం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
చినరాజప్ప, తన ఫోటోను చూపించి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. తద్వారా కాపులతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని లోకేష్ అభిప్రాయపడ్డారు. చినరాజప్ప ఫోటోపై వైసిపి రాద్దాంతం సరికాదన్నారు.
ఆ రోజు పార్టీ ఫేస్ బుక్ పైన ఆ ఫోటో కనిపించిందని, దానిని చూసి తాను కూడా బాధపడ్డానని చెప్పారు. ఇలా వచ్చిందేమిటని ఆవేదన వ్యక్తం చేశానని అన్నారు. అయితే, వైసిపి దానిని రాద్దాంతం చేసిందని, కానీ వీడియో చూశాక అంతా తెలుస్తుందన్నారు. వీడియో చూసినా వైసిపి రాజకీయం మానలేదన్నారు.
తాను పార్టీ జనరల్ సెక్రటరీని కాబట్టి వేదిక పైన కూర్చున్నానని, చినరాజప్ప కింద కుర్చీలో కూర్చున్నారని చెప్పారు. ఏ పార్టీలో అయినా అలాగే ఉంటుందన్నారు. చినరాజప్ప ఏదో చెప్పేందుకు లేచారని, ఆయన చెప్పి కూర్చున్నారని, ఆ ఫోటో ఆయన నిలబడి విషయం చెప్పినప్పడిది అన్నారు. అక్కడ పార్టీ ప్రోటోకాల్ ప్రకారం నడుచుకున్నామన్నారు. కానీ వైసిపి, సాక్షి రాద్దాంతం చేసిందన్నారు. ఒక అబద్దాన్ని పదేపదే చెప్పి నిజం చేసే ప్రయత్నం సరికాదన్నారు.
నాకు, నా తండ్రి మధ్య చిచ్చు పెట్టే యత్నం
తాను ఒక రోజు పాటు పార్టీ సమావేశానికి హాజరు కాకుంటే తనకు, తన తండ్రికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు, బేధాభిప్రాయాలు ఇప్పటి దాకా లేవని చెప్పారు. ఇక ముందు కూడా ఉండవని చెప్పారు. తనకు ఏదో మెడ నొప్పి వచ్చి కార్యక్రమానికి రాకుంటే దానిని తమ కుటుంబంలో విభేదాలుగా సృష్టించారని మండిపడ్డారు.
మంత్రి పదవి, 2019 ఎన్నికల్లో పోటీ పైన..
మంత్రి పదవి వస్తుందనే అంశంపై లోకేష్ స్పందించారు. తనకు మంత్రి పదవి పైన ఎలాంటి ఆసలు లేవన్నారు. అలాగే, 2019 ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని చెప్పారు. తనకు అసలు ప్రధాన కార్యదర్శి కావాలని లేదని, కానీ పార్టీ నాయకులు అందరూ ఒత్తిడి చేయడం వల్ల తాను అంగీకరించానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే కొన్ని చేయాల్సిందేనన్నారు.
రెండేళ్లుగా లోకేష్ జపం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా తాను ఎప్పుడు కూడా కేబినెట్ భేటీలో కూర్చోలేదని చెప్పారు. దానిని విపక్షాలు నిరూపించాలన్నారు. రెండేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ జపం చేస్తోందని ఎద్దేవా చేశారు.
రూ.10వేల కోట్ల బ్లాక్ మనీపై చంద్రబాబు ఏమన్నారంటే..
రూ.10వేల కోట్ల బ్లాక్ మనీ పైన చంద్రబాబు ఏదో మాట్లాడితే, వైసిపి భుజాలు తడుముకుందని ఎద్దేవా చేశారు. హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి రూ.10వేల కోట్లు నల్లధనం పథకం కింద వెల్లడించినట్లుగా పత్రికల్లో వచ్చాయని, అదే విషయాన్ని చంద్రబాబు చెప్పారన్నారు. చంద్రబాబుకు ఎవరో చెప్పలేదన్నారు.
మీడియాలో వచ్చిన విషయం చెప్పారన్నారు. అదే సమయంలో చంద్రబాబు ఎవరి పేరు చెప్పలేదన్నారు. కానీ వైసిపి ఎందుకు భుజాలు తడుముకుంటోందని చెప్పారు. రూ.500, రూ.1000 నోట్లను బ్యాన్ చేయాలని, ఆ బాధ్యత టిడిపి తీసుకుంటుందని చెప్పారు.
బ్రాహ్మణి వ్యాపారం, నేను, నాన్న రాజకీయాలు
తన భార్య బ్రాహ్మణి వ్యాపారం చూసుకుంటోందని లోకేష్ చెప్పారు. తన తండ్రి, తాను మాత్రం రాజకీయాల పైన దృష్టి సారించినట్లు చెప్పారు.
విదేశాల్లో ఆస్తులు లేవు.. టాటా, బిర్లాలు నా బినామీలేనా
తనకు విదేశాల్లో ఎలాంటి ఆస్తులు లేవని లోకేష్ చెప్పారు. తాము ప్రకటించిన ఆస్తులకు మించి ఎక్కడైనా చిల్లి గవ్వ చూపించినా వారి పేరిట రాసిస్తామని సవాల్ చేశారు. రూ.10వేల కోట్ల నల్లధనం తన బినామీలది అని చెప్పడం విడ్డూరమన్నారు. టాటా, బిర్లా కంపెనీలు కూడా నా బినామీలే అంటారేమోనని ఎద్దేవా చేశారు.