కోట్ల దంపతులకు వల: తనయుడితో లోకేష్ చర్చలు
కర్నూలు: మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులకు తెలుగుదేశం పార్టీ వల వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ రంగంలోకి దిగారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుమారుడు రాఘవేంద్ర రెడ్డితో నారా లోకేష్ ఇప్పటికే పలు మార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
తమ పార్టీలోకి వస్తే జిల్లాలో పార్టీ పగ్గాలను అప్పగించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఓ ఎంపీ సీటు, రెండు శాసనసభ స్థానాలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి ఇస్తామని లోకేష్ హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో కోట్ల రాఘవేంద్ర రెడ్డి టిడిపిలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించినప్పటికీ తండ్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తండ్రి కేంద్ర మంత్రిగానూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. జిల్లాలో ఆయన పెద్దాయన అని సంబోధిస్తారు. కర్నూలు జిల్లాలో విశేష ప్రాబల్యం ఉన్న కోట్ల కుటుంబాన్ని పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా తమకు తిరుగు లేకుండా చేసుకోవాలనే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నట్లు చెబుతున్నారు.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి తెచ్చేందుకు నారా లోకేష్ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కూడా రంగంలోకి దింపినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, కోట్ల, కెఈల కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలోకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని తీసుకోవడానికి కెఈ కృష్ణమూర్తి కుటుంబం అంగీకరిస్తుందా అనేది కూడా సమస్యనే.
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, టీడీపీలోకి చేరుతున్నానంటూ తనపై కొన్ని మీడియా సంస్థలు అసత్యప్రచారం చేసాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు వ్యాపారం కోసం రాజకీయ నేతలను భ్రష్టు పట్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.