లోకేష్ ఇలా సర్దుకుపోవాల్సిందేనా .. ఆ కల తీరాలంటే మరో ఐదేళ్ళు ఆగాల్సిందేనా
Recommended Video
మాజీ ఐటీ శాఖ మంత్రి, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలుస్తానని కలలు కన్నారు . ఇక కాబోయే ముఖ్యమంత్రి అని టీడీపీ సైతం ప్రచారం చేసింది. అయితే మంగళగిరి లో ఘోర ఓటమి పాలైన లోకేష్ కల తీరలేదు. ముఖ్యమంత్రి మాట అటుంచి కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు . ఇక దీంతో తీవ్ర నిరాశానిస్పృహల్లో ఉన్న నారా లోకేష్ కొంతకాలం పాటు మీడియాకు దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఆయన అసెంబ్లీ లో హల్చల్ చేశారు. గవర్నర్ ప్రసంగం పుణ్యమాని లోకేష్ అసెంబ్లీలో అడుగు పెట్టారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో కాలు పెట్టిన లోకేష్
ఎమ్మెల్సీ గా ఉన్న లోకేష్ గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మంత్రి కాలేదని ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని బాగానే కష్టపడ్డారు కానీ ప్రతికూల ఫలితం వచ్చింది. ఫలితంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టె అవకాశం కోల్పోయారు. ఇక ఎమ్మెల్సీగా కౌన్సిల్ సమావేశాలకు హాజరు కావాల్సి ఆయన నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. లోకేష్ ఎమ్మెల్సీ కాబట్టి అసెంబ్లీ ప్రాంగణంలోకి రావడానికి ఆయనకు హక్కుంది. అయితే గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ కి వచ్చారు. ఆయన కౌన్సిల్ సమావేశాలకు వెళ్ళే ముందు అసెంబ్లీ లోకి ప్రవేశించి టిడిపి బెంచ్ లో కూర్చున్నారు. ఈసారి లోకేష్ అసెంబ్లీలో కూర్చోవాలనే కోరిక ఈ విధంగా తీరింది అంటూ లోకేష్ గురించి గుసగుసలాడారు శాసన సభ్యులు .
లోకేష్ ఇలా సర్దుకు పోవాల్సిందే ..
ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే లోకేష్ తో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి వైసిపి మంత్రులు, నేతలు ఆయన దగ్గరకు వెళ్లారు. కొన్ని నిమిషాల పాటు ఆయనతో ముచ్చటించారు.
డిప్యూటీ సీఎం అంజాద్ భాషా , విద్యాశాఖ మంత్రి సురేష్ లోకేష్ తో కరచాలనం చేశారు. ఇక ఎప్పుడూ తిట్టిపోసే బిజెపి నేత సోము వీర్రాజును సైతం అసెంబ్లీ దగ్గర లోకేష్ నమస్తే అంటూ పలకరించారు. వైసీపీ నేతలతో, మంత్రులతో అందరితో సరదాగా ముచ్చటిస్తూ లోకేష్ అసెంబ్లీలో కాసేపు హల్ చల్ చేశారు. తనలో ఉన్న కొత్త కోణాన్ని అసెంబ్లీలో చూపించారు. కానీ లోకేష్ పరిస్థితి చూస్తే లోకేష్ ఇలా సర్దుకుపోవాల్సిందేనా. ఎప్పుడైనా గవర్నర్ ప్రసంగాలకు తప్ప లోకేష్ అసెంబ్లీలోకి వచ్చే అవకాశమే లేదా .. అన్న భావన కలుగుతుంది. ఇక లోకేష్ ఎమ్మెల్యే కోరిక తీర్చుకోవాలంటే మరో ఐదేళ్ళ పాటు వేచి చూడాల్సిందే .
ఎమ్మెల్యేగా అసెంబ్లీ లో అడుగుపెడతానన్న కల తీరాలంటే మరో ఐదేళ్ళు ఆగాల్సిందే
ఎమ్మెల్సీ అయ్యి దొడ్డి దారిన మంత్రి అయ్యారని లోకేష్ పై పలు విమర్శలు వచ్చిన నేపధ్యంలో పోటీ చేసి సత్తా చాటి విజయం సాధించి తీరతా అన్న లోకేష్ పోటీ చేసిన మొదటిసారి ఓటమి చవి చూసారు. ఇక లోకేష్ ఎమ్మెల్సీ కూడా మరో రెండేళ్ళ కాలపరిమితే ఉంది. అసెంబ్లీలో టీడీపీ కి బలం కూడా లేదు. ఈ నేపధ్యంలో రెండేళ్ళ తర్వాత మరో సారి లోకేష్ కు ఎమ్మెల్సీ కూడా కష్టమే . ఇక ఈ నేపధ్యంలో లోకేష్ బాబు మళ్ళీ ఎన్నికల కోసం వేచి చూడాలి . ఈ లోపు ఇలా అప్పుడప్పుడు చినబాబు గవర్నర్ ప్రసంగం ఏదైనా ఉంటె అసెంబ్లీకి వచ్చి తన సరదా తీర్చుకోవచ్చు.