వైశ్రాయ్ విద్యలు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇక ఖతమ్: నారా లోకేశ్పై అంబటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేశ్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, లేదంటే పదవులను త్యాగం చేస్తామని కొందరు సీనియర్ మంత్రులు అంటున్నారని, అసలు అలా త్యాగం చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు.
టీడీపి సీనియర్ మంత్రులంతా చంద్రబాబు ఆదేశాలమేరకు లోకేశ్ కు భజన బృందంగా తయారయ్యారని అభిప్రాయపడ్డారు. తనను పొగడటం మాని లోకేశ్ ను పొగడాలని, అలా చేస్తేనే మంత్రులకు ఇక మంచి మార్కులు ఉంటాయని చంద్రబాబు చెప్పడం వల్లే వాళ్లు బాజాభజంత్రీలతో తెగ మోస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు 60 విద్యలు తెలిస్తే లోకేశ్ కు డబుల్ విద్యలు తెలుసునని అన్నారు.
లోకేశ్ కు వైశ్రాయ్ విద్యలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విద్య, కబ్జా చేయడంలో కూడా గొప్ప విద్య నేర్చుకున్నారని అన్నారు. కబ్జాలు చేసే విషయంలో చంద్రబాబుది డిగ్రీ అయితే లోకేశ్ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని గురువారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
రెండేళ్ల కాలంలో దౌర్భాగ్య పాలన చేశారని, ఆ పాలన చంద్రబాబుది కాదని లోకేశ్దే అని చెప్పారు. రాజ్యాంగేతర శక్తిగా ఉన్న లోకేశ్ రాజ్యాంగ శక్తిగా వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారని చెప్పారు. అందుకే మంత్రులంతా బాజాభజంత్రీలు వాయిస్తున్నారన్నారు.
లోకేశ్ ది ఐరన్ లెగ్ అని, వచ్చి రాగానే మనీ ట్రాన్స్ ఫర్ స్కీం అంటూ ఘోరంగా విఫలమైన విషయం అందరికీ తెలుసని అన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్లో ఎన్ని సీట్లు లోకేశ్ వల్ల వచ్చాయో అందరికీ తెలుసని, అది మాములు ఫలితాలు కావని, ఎంతో కష్టపడి ఒక్కటంటే ఒక్కటే స్థానం దక్కించుకున్నాడనిఆయన వ్యంగ్యంగాఅన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని భూస్థాపితం చేయడానికి లోకేశ్ పుట్టాడని అన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేదని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కేబినెట్ సెక్రటరీపై ఎగిరితే ఏం రాదని అన్నారు. విభజన అంశాలపై, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు చంద్రబాబు గట్టిగా నిలదీయడం లేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం తాకట్టుపెట్టేపని చంద్రబాబు చేయొద్దని సూచించారు. ప్రధానికి కొఠారి ద్వారా రాయభారం నడపాల్సిన అవసరం ఏమిటని, విభజన హామీలను అమలుపర్చాలని కొఠారిని అడిగినట్లు లీకులు ఇవ్వడం దేనికని ప్రశ్నించారు. అసలు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు అల్టిమేటం ఇవ్వడం లేదని మండిపడ్డారు.