ఇక ప్రజలతో మమేకం..! సమస్యల పరిష్కారం కోసం పోరాటం..!దూకుడు పెంచిన లోకేష్..!!
అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి యువరక్తం చేరబోతోంది. యువత రాజకీయాలవైపు మొగ్గు చూపుతుండడంతో సీనియర్ మోస్ట్ నాయకులందరూ రిటైర్మెంట్ ప్రటించాల్సిన తరుణం కూడా ఆసన్నమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి లోకేష్ ప్రత్యక్షరాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని నిర్ణయించుకోవడంతో ఏపిలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజల సమస్యలపై పోరాడేందుకు నడుంబిగించాలని నారా లోకేష్ నిర్ణయించారు. గుంటూరులో ఇసుక లభ్యత గురించి లోకేష్ చేసిన ఒక రోజు దీక్ విజవంతం కావడంతో ఇక మీదట ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలతో మమేకం అయ్యేందుకు లోకేష్ వ్యూహ రచన చేస్తున్నారు.
లోకేష్ ఫుల్ రీఛార్జ్..!
గ్రామస్తుల అడుగులో అడుగు కలిపి నడిచారు. భుజం తట్టి ధైర్యం నూరిపోసారు. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరినీ పేరుపేరునా పలకరించారు. వయసులో పెద్దావిడ ఆశీర్వచనం తీసుకున్నారు. ఆప్యాయంగా ఓ చిన్నారి నుదిటిన ముద్దాడారు. రాజకీయ ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తూ, ట్విట్టర్ వేదిక మీదే ఎక్కువగా కనిపించే కీలక నేత, టీడిపి జనరల్ సెక్రటరీ నారా లోకేష్ ఇలా జనంతో మమేకమైయ్యేందుకు కార్యచరణ రూపొందింస్తున్నారు. లోకేష్ తీరు చూస్తుంటే క్రమంగా ఆయన వ్యవహార శైలి మార్చుకుని ప్రజా జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నయి.
సమస్యల పరిష్కరమే లక్ష్యం..!
అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పరాజయం పాలైంది. స్థానిక నేతలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కనిపెట్టలేకపోయామనీ, సంక్షేమ పథకాల లబ్దిని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయామనీ ఇదే తమ ఓటమికి కారణమని టీడిపి అధినేత చంద్రబాబునాయుడు సన్నిహితుల దగ్గర పలుసార్లు వాపోయారు. ఇలాంటి పరిస్థితులను అదిగమించేందకు మాజీ మంత్రి లోకేష్ రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది.
ప్రజా సమస్యలపై పోరాటం..!
జగన్ సుధీర్ఘ పాదయాత్రను లోతుగా విశ్లేషించుకున్న తర్వాత పథకాలు, పాలనే కాకుండా ప్రజలకు దగ్గరగా ఉండటం, ప్రజలతో మమేకం అవ్వడం కూడా ముఖ్యమని లోకేష్ గ్రహించినట్టున్నారు. ఈమధ్య తన సహజమైన ట్రెండ్ ని పూర్తిగా మార్చేశారు. అవకాశం వొచ్చిన ప్రతిసారీ జనానికి దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన జనంతో గెట్టిగా కరచాలనం, కావలించుకోవడం, చిన్నారులని ముద్దాడడం, తలపై ప్రేమగా నిమరడం వంటి వ్యవహారాలు సరికొత్త లోకేష్ ని పరిచయం చేస్తున్నాయి.
ఇక ముందు ప్రజా జీవితానికే ప్రాధాన్యం..!
ఇటీవల తన నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ప్రత్యేక పూజ, గ్రామకమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. సమస్యలపై చర్చిస్తూ అందరితో కలిసిపోయారు. అంతకుముందు అనారోగ్యం పాలైన ఒక సామాన్య కార్యకర్త ఇంటికి స్వయంగా వెళ్లి పలకరించారు. ఎవరికీ ఏ సమస్య వచ్చ్చినా తనను సంప్రదించాలంటూ పదేపదే చెబుతున్నారు. ఎన్నికల గెలవాలంటే ముందు ప్రజల మనసులు గెలుచుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చ్చినట్టు తెలుస్తోంది. ముందుగా జనంలోకి చొచ్చుకెళ్తే తర్వాత సంగతి తర్వాత చూద్దామనే ధోరణిని లోకేష్ వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం గుంటూరులో ఇసుక కోసం ఒక రోజు చేసిన దీక్షతో లోకేష్ తన కార్యాచరణలుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.