కేంద్రం నుంచి కొనుగోలు చేయండి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగన్కు లోకేష్ లేఖ...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై టీడీపీ జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్కు లేఖ రాశారు.జాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని లేఖలో కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్కే తలమానికమని... ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. పార్లమెంటులో 28 మంది ఎంపీలు ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపడంలో వైసీపీలో విఫలమైందని... తాజా బడ్జెట్లోనూ ఏపీకి ఏమీ సాధించలేకపోయారని విమర్శించారు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని.. స్వాతంత్య్ర సమరయోధులు టి.అమృతరావు,విశ్వనాథం నేత్రుత్వంలో అహింసా మార్గంలో సాగిన ఉద్యమం ద్వారా ఉక్కు కర్మాగారం కల సాకారమైందని గుర్తుచేశారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం ద్వారా 40వేల మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి దొరుకుతోందని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలోనూ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు... నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అడ్డుకుందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉక్కు కర్మాగారాల తరహాలో విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇనుక ఖనిజపు గనుల కేటాయింపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇనుప ఖనిజపు గనుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని.... లేదా కేంద్రం నుంచి ఈ ప్లాంట్ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కోల్పోయేలా చేస్తారా అని ప్రశ్నించారు.
ఉక్కు కర్మాగారం చరిత్ర, ప్రజలతో ఉన్న అనుబంధం దృష్ట్యానే కాకుండా ఆర్థికపరంగానూ ఇది ఎంతో కీలకమైనదని లోకేశ్ తన లేఖలో స్పష్టం చేశారు. ఉక్కు అనేది భారత్ కు చెందిన ముఖ్య పరిశ్రమల్లో ఒకటని, 2032 నాటికి విశాఖ స్టీల్ ప్లాంటు అతిపెద్ద ఉక్కు ఉత్పాదక కర్మాగారంగా నిలుస్తుందని ఉద్ఘాటించారు.
కాగా,దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రం... విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకుని 100శాతం ప్రైవేట్ వారికే కర్మాగారాన్ని అప్పగించాలని నిర్ణయించింది. అయితే సంస్థపై యాజమాన్య హక్కులను పూర్తిగా వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడడం పట్ల రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ,జనసేన సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.త్వరలోనే ఢిల్లీ వెళ్లి దీనిపై కేంద్రంతో మాట్లాడుతామని ఆ పార్టీలు ప్రకటించాయి.
రాష్ట్ర ప్రజల త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ని స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టోద్దంటూ @ysjagan గారికి లేఖ రాసాను. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలి.(1/2) #VisakhaUkkuAndhrulaHakku pic.twitter.com/lWV8dDy7JY
— Lokesh Nara (@naralokesh) February 5, 2021