నారా రోహిత్ జోస్యం .. టీడీపీ కి 150 సీట్లు వస్తాయట
ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. జాతీయ నేతలతో, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం కొనసాగిస్తుంది. ఈసారి విజయం సాధించటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీడీపీ దాని కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది . అందుకోసం మరో స్టార్ క్యాంపెయినర్ నారావారి హీరో నారా రోహిత్ రంగంలోకి దిగారు . తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం ప్రారంభించిన రోహిత్ తన మాటలతో ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మురళీమోహన్ కోడలు మాగంటి రూప కోసం నారా రోహిత్ ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేది టీడీపీయేనని, మరోసారి చంద్రబాబు సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని సినీ నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు.. రాజమండ్రి లోక్ సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మురళీమోహన్ కోడలు మాగంటి రూపకు మద్దతుగా సీతానగరం, రఘుదేవపురం ప్రాంతాల్లో ప్రచారం చేసిన రోహిత్, మంచి చేసే నేతలను ప్రజలు ఎన్నటికీ మరచిపోబోరని అన్నారు. టీడీపీ చేసిన మంచి పనులు, చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని విజయపధంలో నడిపిస్తాయని చెప్పారు. పథకాల లబ్ధిదారులంతా టీడీపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
టీడీపీ 150 స్థానాలు కైవసం చేసుకుంటుందన్న నారా రోహిత్
ఇక పశ్చిమగోదావరి చాగల్లులోని కాలవలపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించిన నారా రోహిత్ కచ్చితంగా టీడీపీ 150 స్థానాలు సొంతం చేసుకుంటుంది అని జోస్యం చెప్పారు. పార్టీ శ్రేణులు, నాయకులు చాలా జోష్ తో పని చేస్తున్నారన్న నారా రోహిత్ అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ రెండూ టీడీపీ చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ప్రజల నుండి టీడీపీ నేతలకు మంచి రెస్పాన్స్ ఉందన్న రోహిత్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని పేర్కొన్నారు .