'జీవితాంతం జగన్ వెంటే ఉంటా', 'చంద్రబాబు పనికిమాలిన సీఎం'
అమరావతి: తాను జీవితాంతం వైయస్ జగన్ వెంటే ఉంటానని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నరసరావుపేటలో మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టింది జగనేనని, పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. ఏపీలో వలసలపై ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేంద్రం నుంచి నిధులు తేవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ఆర్ధిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మొండిచేయి చూపించిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయిస్తే దీని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు యూజులెస్ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పనికిమాలిన ముఖ్యమంత్రి అని శాసనమండలిలో విపక్షనేత సి రామచంద్రయ్య అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేసి, టీడీపీలో మరో సమర్థుడికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రం నుంచి నిధులు తేవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఆయన విచ్చలవిడి అవినీతి వల్లే కేంద్రం సహకరించడం లేదని అన్నారు. చంద్రబాబు సిగ్గులేకుండా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓటుకు నోటు కేసును మాఫీ చేసుకోవడానికి చంద్రబాబు రాజీపడ్డారని ఆయన ఆరోపించారు.