గవర్నర్ నరసింహన్ సేఫ్: పుకార్లకు తెర దించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నర్గా నరసింహన్ను మారుస్తారనే పుకార్లకు తెర పడింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ఊహాగానాలకు తెర దించారు. తెలంగాణ, ఏపీ ఇరు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ను మార్చే ఉద్దేశ్యం లేదని ఆమె చెప్పారు.
గవర్నర్ నరసింహన్ను మారుస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని, మంత్రివర్గ నిర్ణయాలను మాత్రమే అమలు పరుస్తారని ఆమె వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా జస్టిస్ సదాశివం రావొచ్చునని పత్రికల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ స్థానంలో కేరళ గవర్నర్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ సదాశివంను నియమించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి.
రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించేందుకు, న్యాయబద్ధంగా వ్యవహరించేందుకు జస్టిస్ సదాశివం వంటి అత్యున్నత స్థానంలో పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి సేవలు అవసరమన్న చర్చ కేంద్రంలో జరుగుతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి.