జగన్పార్టీతో 15 కోట్ల డీల్: సిపిఎంపై నారాయణ, జెపిపై..
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రంపై విరుచుకుపడ్డారు. సిపిఎం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఖమ్మంలో తనను ఓడించడానికి తమ్మినేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి రూ.15 కోట్ల డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు.
గతంలో పువ్వాడ నాగేశ్వర రావును ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తమ్మినేని రూ.70 లక్షలు తీసుకున్నారని, ఇప్పుడు తనను ఓడించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. తనను ఓడించేందుకు జగన్ పార్టీ నుండి రూ.15 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు.
సిపిఎం పార్టీ ఓ దివాళాకోరు పార్టీగా తయారైందన్నారు. నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. సిపిఐ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా సిపిఐ పని చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ రాజకీయ బఫూన్లు అన్నారు. మోడీ, పవన్ కళ్యాణ్ అంటూ జెపి చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు.
ఎన్నికల నిర్వహణపై రమాకాంత్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని, సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి వేరుగా తెలిపారు. ఎన్నికల కోసం కర్ణాటక నుంచి 20 వేలు, ఒడిశా నుంచి 8 వేలు, తమిళనాడు నుంచి 7 వేల బ్యాలెట్ బాక్కులు తెచ్చామన్నారు. పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలలో చెదలుపట్టిన, తడిసిపోయిన బ్యాలెట్ పత్రాల లెక్కింపును పూర్తి చేసి ఫలితాలను కూడా వెల్లడించామన్నారు.