కెవిపి చెన్నై బూచీ చూపిస్తున్నారు, అమరావతి సేఫ్: నారాయణ
విజయవాడ: అతి భారీ వరదలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముప్పేమీ ఉండదని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. చెన్నైలో వచ్చిన వరదలను బూచీగా చూపి భవిష్యత్తులో అమరావతి పరిస్థితి కూడా అదేనని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరి కాదని ఆయన అన్నారు.
వందేళ్ల వరద 16 వేల క్యూసెక్కులు అనుకుంటే ఒక వేళ భవిష్యత్తులో 25 వేల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునే విధంగా రాజధాని ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు సూచించారని ఆయన చెప్పారు. ఆమరావతికి వరద ముప్పు పొంచి ఉందంటూ కెవిపి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు.
అమరావతిపై కెవిపి కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. కెవిపి చెబుతున్న పరిస్థితి చెన్నైకి రావడానికి ఆ నగరంలో పెద్ద యెత్తున సాగిన అక్రమ నిర్మాణాలే కారణమని అన్నారు. అమరావతికి అలాంటి పరిస్థితి రానీయబోమని ఆయన అన్నారు.
అమరావతికి 210.1 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 7,784 ఎకరాల విస్తీర్ణంలో 89 గ్రామాల మీదుగా 50 మీటర్ల వెడల్పుతో ఔటర్ నిర్మాణం జరుగుతుందని, ముఖ్యమంత్రి సూచనల మేరకు ఔటర్ పక్కనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం కూడా చేపడుతామని చెప్పారు. రింగ్ రోడ్ ఏర్పాటుతో అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రజలు సులభంగా విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికను ఈ నెల 23లోగా అథారిటీకి సమర్పించి వీలైనంత త్వరంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు నారాయణ తెలిపారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనకు అనుగుణంగా వేగంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారని ఆయన అన్నారు.