ఎమ్మెల్యే కావాలన్న కల: అసలే కార్పొరేట్.. ఆరోపణల డీఈఓకే అందలం..
అమరావతి: గత ఎన్నికల వరకు డాక్టర్ పొంగూరు నారాయణ ఒక విద్యావేత్త.. విద్యాసంస్థల గ్రూపు అధినేత. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉంటూ వచ్చారు. 2004లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత పార్టీకి అండగా నిలిచిన వారిలో ఒకరన్న అభిప్రాయం ఉన్నది. ఇంటర్ నుంచి మెడిసిన్ వరకు.. సీఏ నుంచి ఎంబీఏ వరకు అన్ని రకాల కోర్సులతో కూడిన కాలేజీలు నడిపిన నారాయణ గ్రూప్ విద్యాసంస్థల్లో ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులతో నేరుగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జిల్లా కోఆర్డినేటర్లుగా నియమించడంలో కీలక పాత్ర పోషించారని అప్పట్లో వార్తలొచ్చాయి.
ప్రత్యక్ష రాజకీయంగా దూరంగా ఉన్న 2014 సాధారణ ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష పార్టీ టీడీపీకి బహిరంగంగా మద్దతు తెలిపిన విద్యావేత్తల్లో ఆయన ఒకరు. అంతేకాదు... గత జమిలీ ఎన్నికలలో నాలుగు జిల్లాలలో కార్పొరేట్ తరహా రాజకీయాలు నడిపి టీడీపీ గెలుపుకు తనవంతుగా అహర్నిశలు కృషి చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా నిలిచారు.
ఏపీ క్యాపిటల్ కమిటీలో సభ్యుడిగా నారాయణ కీలకం
నారాయణ సేవలు గుర్తించినందు వల్లే ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కాకున్నా తన క్యాబినెట్లో చోటు కల్పించారు. తర్వాత శాసనమండలి సభ్యత్వం కూడా ఇప్పించారు. 2014 నుంచి అధికార తెలుగుదేశం పార్టీలో అన్నింటా కీలకం ఆయనన్న సంగతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏర్పాటైన కమిటీలో ఆయన సభ్యుడంటే ఏపీ ప్రభుత్వంలో నారాయణకు గల ప్రాధాన్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుత అమరావతి నగర నిర్మాణానికి అవసరమైన భూసేకరణ బాధ్యతలు రెవెన్యూ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం కేయీ క్రుష్ణమూర్తికి బదులు అన్నీ తానై వ్యవహరించారు నారాయణ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ‘సైకిల్' ఎక్కించడంలో విఫలం
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారాయణ పూర్తిగా ప్రజాసేవ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. సొంత జిల్లా నెల్లూరులో అభివృద్ధి పనులపై సీరియస్గా దృష్టి పెట్టారు. పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. నెల్లూరు నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ.. తాగునీటి పథకాలు తెచ్చారు. నెల్లూరు పెన్నా.. సంగం బ్యారేజీ నిర్మాణాల బాధ్యతను తీసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీగా మార్చడంలో సక్సెస్ అయ్యారు. మునిసిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయించి.. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. అయినా తెలుగు తమ్ముళ్లకు దగ్గర కావడంలో వెనుకబడి ఉన్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నలుగురిని పార్టీలోకి తేవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజాయానికి దూరం
గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ను మాత్రమే టీడీపీలోకి తేగలిగారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ విజయం కోసం ఎంతో శ్రమించారు కానీ అందులో విజయం సాధించలేకపోయారు. వచ్చే ఎన్నికల సమయానికి ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తవుతుంది.. అందుకే నారాయణ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ప్రధానంగా నెల్లూరు సిటీ నుంచి గానీ, నెల్లూరు రూరల్ నుంచి గానీ పోటీ చేయాలనేది నారాయణ ఆలోచనట! ఇప్పటికే ఆయన మనుషులు డివిజన్లలో తిరుగుతూ ప్రజా సమస్యలను కంప్యూటర్లకు ఎక్కిస్తున్నారు. ఈ మధ్య నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ప్రాంతాలలోనే ఎక్కువగా పర్యటిస్తూ, ప్రజలతో మమేకం అవుతున్నారు. చిన్నపాటి అపోహలను తొలగించుకోవాల్సిన బాధ్యత నారాయణదే.
అనిల్ కుమార్ యాదవ్ కు నారాయణే గట్టిపోటీ
నెల్లూరు సిటీ నుంచి ఆయన గెలుపొందడం నల్లేరు మీద నడకేం కాదు. ఈ క్రమంలోనే స్థానికంగా నెల్లూరు నగర పరిధిలో జరిగే ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరవుతూ ప్రజలతో ఇష్టాగోష్టిగా సమావేశమవుతూ ముందుకు సాగుతున్నారు. ఎవరేమన్నా టీడీపీలో ఆయన ‘క్యాష్' పార్టీ అంటే అతిశయోక్తి కాదు. ఇంతకుముందు ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ముంగమూరు శ్రీధర్ క్రుష్ణారెడ్డిని, బీజేపీ అభ్యర్థి సురేశ్ రెడ్డిని ఓడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్నది. అదే సమయంలో నెల్లూరు సిటీలో రెడ్లదే ఆధిపత్యం. అయితే నారాయణ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే అనిల్ కుమార్ యాదవ్కు గట్టి పోటీ ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట నెల్లూరు సిటీ.
నెల్లూరు సిటీలో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం
నారాయణ తన బలిజ సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. రెడ్ల కంటే నెల్లూరు సిటీ పరిధిలోని రెడ్డి సామాజిక వర్గం కంటే బలిజలదే ఆర్థికంగా ఆధిపత్యం. ఇదొక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభించే అంశం. కనుక నారాయణ రెడ్డి సామాజిక వర్గానికి దగ్గరయ్యే దానిపైనే వచ్చే ఎన్నికల్లో ఆయనవిజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. తద్వారా వైఎస్ జగన్మోహనరెడ్డికి రెడ్లను దూరం చేయడంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో టీడీపీ జెండా ఎగురవేసిన ఘనత నారాయణకు దక్కుతుందని రాజకీయ విశ్లేషఖులు అభిప్రాయ పడుతున్నారు. ఆ మేరకు ఆయన విజయం సాధిస్తారా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
యూనివర్సిటీ వైపే చూడని మంత్రి నారాయణ
మరోవైపు నియోజకవర్గ పరిధిలో అన్ని రకాల వసతుల కల్పనపైనే నారాయణ ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బోధన మెరుగుదలకు, ఆసుపత్రిలో వైద్య విధానంలో మార్పులు తీసుకురావడానికి నారాయణ ప్రయత్నిస్తున్నారు కానీ ఫలితం రావడం లేదు. ఇక విక్రమ సింహపురి యూనివర్సిటీ సంగతి సరేసరి! కాంట్రాక్టు ఉద్యోగుల కంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకే జీతాలు ఎక్కువ ఇస్తున్నారక్కడ..! ప్రభుత్వం అందిరికీ సమానవేతనం ఇవ్వాలని సూచించినా పట్టించుకునే దిక్కులేదు. మౌలిక వసతులూ అంతంత మాత్రమే! చిన్నపాటి సమస్యలను కూడా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయినా యూనివర్సిటీకి నారాయణ ఒక్కసారంటే ఒక్కసారి కూడా వెళ్లలేదు. జిల్లా విద్యాశాఖ అధికారిగా గతంలో పనిచేసిన మువ్వా రామలింగంపై ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. గతంలో ఆరోపణల మీదే ఇక్కడి నుంచి వెళితే.. మళ్లీ ఆయననే డీఈవోగా తీసుకొచ్చారు.
బీఈడీ కాలేజీ ప్రిన్స్ పాల్ గా బదిలీతో నారాయణపై విమర్శలు
మరోసారి ఆరోపణలు రుజువుకావడంతో ప్రభుత్వానికి మువ్వా రామలింగాన్ని సరెండర్ చేశారు. అయినా ఆయనను బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ను చేయడంపై నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. కలిగిరిలో ఓపెన్ స్కూల్ పరీక్షలో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరిగింది. అందుకు కారకులైన వారిపై ఉన్నతాధికారులు వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. మంత్రి నారాయణ వారిని కాపాడారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆ విషయం అలా ఉంచితే మునిసిపల్ శాఖ మంత్రిగా నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ను గాడిలో పెట్టలేకపోతున్నారనే విమర్శ వినిపిస్తోంది.. అధికారులకు.. ప్రజా ప్రతినిధులకు అస్సలు పడటం లేదట! అవినీతి పెరిగిందట! ప్రజాసమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయట! ఇలాంటి వాటివల్ల నారాయణ చేస్తున్న మంచి పనులను జనం గుర్తించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనం మద్దతు ఏ మేరకు కూడగట్టగలరన్నది వేచి చూడాల్సిందే మరి.