'ఆ తప్పుల వల్లే నారాయణరెడ్డి హత్య', పత్తికొండ టిక్కెట్ ఆయన సతీమణికే.. జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణ రెడ్డి హత్యపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణ రెడ్డి హత్యపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నారాయణ రెడ్డి హత్యలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హస్తం ఉందని, సీఎం చంద్రబాబు డైరెక్షన్లో కుట్ర జరిగిందని జగన్, వైసిపి ఆరోపిస్తోంది.
మేం కాదు, ఆయనే: నారాయణరెడ్డి హత్యలో డిజిపి ట్విస్ట్, అదే వెంటాడి చంపింది!
దీనిపై టిడిపి కౌంటర్ ఇచ్చింది. కర్నూలు జిల్లా టిడిపి నేతలు కూడా వైసిపిపై మండిపడుతున్నారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యతో ప్రభుతానికి, పార్టీకి, కేఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, హత్యా రాజకీయాలు తమ సంస్కృతి కాదని టిడిపి క్రమశిక్షణ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
నారాయణ రెడ్డి చేసిన తప్పులు, వ్యక్తిగత కక్షలే హత్యకు దారి తీశాయి
గత కాంగ్రెస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలను పెంచి పోషించిందని, అదే సంస్కృతిని నేడు వైసిపి కొనసాగిస్తోందని సోమిశెట్టి అన్నారు. కాంగ్రెస్ హయాంలో నేరాలను ప్రోత్సహించి నేరస్తులకు ఆశ్రయం కల్పించారని సోమిశెట్టి ఆరోపించారు. నారాయణ రెడ్డి చేసిన తప్పులు, వ్యక్తిగత కక్షలే ఆయన హత్యకు దారితీశాయని, ఇది రాజకీయ హత్య కాదన్నారు.
కోట్ల అనుచరుడిగా ఎన్నో తప్పులుు
కోట్ల అనుచరుడిగా నారాయణ రెడ్డి ఎన్నో తప్పులు చేశారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఆయన దౌర్జన్యాల వల్ల ఎన్నో కుటుంబాలు ఊరు వదిలివెళ్లిపోయాయని టిడిపి నేత నాగేశ్వర యాదవ్ విమర్శించారు.
కేఈ తనయుడి ఎదుగుదల ఓర్వలేకే
కేఈ తనయుడు కేఈ శ్యాంబాబు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే నారాయణ రెడ్డి హత్య కేసులో ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేశారని తెలుగు యువత కర్నూలు జిల్లా అధ్యక్షులు పర్వేజ్ ఆరోపించారు.
అందరూ ఆయుధాలు తీసుకెళ్లినా.. నారాయణ రెడ్డి తీసుకెళ్లలేదు
మరోవైపు, నారాయణ రెడ్డి హత్యలో పోలీసుల వైఫల్యం లేదని డీఐజీ రమణ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అందరి నుంచి తుపాకులు డిపాజిట్ చేసుకున్నామని, ఎన్నికల ముగిసిన తర్వాత వారివారి ఆయుధాలు తీసుకెళ్లారని తెలిపారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి తీసుకెళ్లలేదన్నారు.
రక్షణ కోసం పోలీసుల్ని కోరనే లేదు
ఆయుధ అనుమతి కోసం గత నెల 3న కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారని, అదే నెల 11న ఎస్పీ వద్దకు దస్త్రం వచ్చిందని డీఐజీ తెలిపారు. నారాయణ రెడ్డి రక్షణ కల్పించాలని పోలీసులను కోరలేదని తెలిపారు.
గన్ ఇవ్వలేదన్న ఆరోపణ అవాస్తవం
నారాయణ రెడ్డి, సాంబశివా రెడ్డి హత్యలకు కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిపిస్తామని, డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ రవికృష్ణ అంతకుముందు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అందరూ ఆయుధాలు తీసుకెళ్లినా నారాయణ రెడ్డి తీసుకెళ్లలేదన్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై ఇవ్వలేదన్నది అవాస్తవమన్నారు.
పత్తికొండ నుంచి నారాయణ రెడ్డి సతీమణి పోటీ
మరోవైపు, నారాయణ రెడ్డి హత్య నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నుంచి వైసిపి తరఫున నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. నారాయణ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.