తాతలైన మంత్రులు: మనవడిని ఎత్తుకుని మురిసిపోయిన గంటా, నారాయణ..
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శరవణి మగబిడ్డకు జన్మనిచ్చింది. మనవడు పుట్టాడని తెలియగానే ఇద్దరు మంత్రులు ఆసుపత్రికి వచ్చారు.
హైదరాబాద్: వియ్యం అందుకున్న మంత్రులిద్దరూ ఇప్పుడు తాతయ్యలయ్యారు. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు ప్రస్తుతం మనువడు పుట్టిన ఉత్సాహంలో ఉన్నారు. నారాయణ కుమార్తె శరవణి, గంటా కుమారుడు రవితేజలకు గతేడాది వివాహం జరగ్గా.. తాజాగా వారికి మగబిడ్డ పుట్టాడు.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శరవణి మగబిడ్డకు జన్మనిచ్చింది. మనవడు పుట్టాడని తెలియగానే ఇద్దరు మంత్రులు ఆసుపత్రికి వచ్చారు. మనవడ్ని ఎత్తుకుని మురిసిపోయారు. కాగా, మంత్రి గంటా తన తనయుడు రవితేజను హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. జయంత్.సి పరాన్జీ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది.
రవితేజ సింగపూర్లో బీబీఎం చదివి అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించగా.. శరవణి లండన్లో ఎంబీఏ పూర్తి చేశారు.నారాయణకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా.. కుమారుడు ఇటీవలే దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఇక మంత్రి గంటాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు కాగా.. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి.