అక్కడే: రాజధానిపై ఎపి మంత్రి, సందేహమొద్దని దేవినేని
హైదరాబాద్: విజయవాడ - గుంటూరుల మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అనుకూలమని ఆ రాష్ట్ర మంత్రి నారాయణ బుధవారం అన్నారు. ప్రపంచం ప్రమాణాలకు అనుగుణంగా రాజధాని ఉంటుందని ఆయన చెప్పారు. పంట దిగుబడి పెంచేందుకు ప్రజలకు మెరుగైన విధానాలు చెబుతామని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న మాటను నిరూపిస్తామని చెప్పారు.
సందేహాలు వద్దు: దేవినేని
రైతుల రుణమాఫీపై సందేహాలు అవసరం లేదని, కచ్చితంగా అమలుచేసి తీరతామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరుగా స్పష్టం చేశారు. ఈ దిశగా కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారని వెల్లడించారు.
బాధ్యతలు స్వీకరించిన కంభంపాటి
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా వ్యవహరిస్తానన్నారు. రాష్ట్రానికి అవసరమైన వనరులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిపెడతానన్నారు.