'లక్ష్మీపార్వతిలా జగన్ ఓవరాక్షన్ చేస్తే అంతే, మనకు మూడు కోతులు'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్కు ఓవరాక్షన్ చేయడం తప్ప మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఓవరాక్షన్ చేస్తే అధోగతి పాలవుతారని, ఏం మిగలదన్నారు.
చదవండి: మేం చచ్చిపోతాం: జగన్పై జెసి దివాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్లు
జగన్ ఓవరాక్షన్ ఆపేయాలని సూచించారు. వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి, అన్నాడీఎంకే నాయకురాలు, చిన్నమ్మ శశికళ ఓవరాక్షన్తోనే నష్టపోయారని, జగన్ కూడా అలాగే నష్టపోతారని జోస్యం చెప్పారు.
మూడు కోతుల్లా..
తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీఆర్, జగన్ మూడు కోతుల్లా వ్యవహరిస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని వారు ముగ్గురూ ఒక దేవుడిలా చూస్తున్నారని, ఢిల్లీకి వెళ్లి మోడీ ముందు భక్తి, గౌరవాలతో మాట్లాడుతున్నారన్నారు. సమస్యలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
మోడీ ముందు ముగ్గురూ కోతుల్లా..
మహాత్మ గాంధీ మూడు కోతుల గురించి చెప్పారని, అందులో ఒక కోతి వినదు, మరొకటి మాట్లాడదు, ఇంకోటి చూడదని నారాయణ చెప్పారు. మహాత్మా గాంధీ కూడా తెలుగు రాష్ట్రాల్లో మనకు మూడు కోతులను వదిలి వెళ్లారన్నారు. మోడీ ముందు చంద్రబాబు, కేసీఆర్, జగన్లు ఇలాగే వ్యవహరిస్తున్నారన్నారు.
జగన్ చాంబర్లోకి నీటిపై రగడ ఏమిటి
జగన్ ఛాంబర్ లోకి నీళ్లు వచ్చాయంటూ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, రాష్ట్ర సమస్యలపై మాట్లాడకుండా, భవనంలోకి నీళ్లొచ్చాయి, ఛాంబర్లోకి నీళ్లొచ్చాయని వాదించుకోవడం విడ్డూరమని నారాయణ అన్నారు.
చంద్రబాబుకు నారాయణ సూచన
మోడీ, చంద్రబాబుల మూడేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు కోట్లు దాటుతుంటే, అమలు మాత్రం గడప దాటడంలేదన్నారు. ఇప్పటికైనా సీపీఐ, ఇతర రాజకీయ పార్టీలతో కలసి ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు పోరాడాలని సూచించారు. ఆవు మాంసాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఓట్ల కుట్ర దాగుందని నారాయణ చెప్పారు. చేపలు, కోళ్లు తదితర జీవుల మాంసంపై లేని నిషేధం ఆవులకే ఎందుకొచ్చిందో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. మత రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకునే ఎత్తుగడను ప్రధాని అమలు చేస్తున్నారని విమర్శించారు.