ఓటుకు నోటు కేసుతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు: బాబుపై బీజేపీ
గుంటూరు: గుంటూరు సభలో బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఐవీఆర్ కృష్ణారావు మండిపడ్డారు.
బీజేపీపై బురదజల్లే ప్రయత్నం.. ఐవైఆర్ కృష్ణారావు
అబద్దపు లెక్కలు చెప్పి ఏపీ ప్రజలను మోసపుచ్చడమే కాకుండా బీజేపీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఐవీఆర్ కృష్ణారావు అన్నారు. విద్యా సంస్థల విషయంలో కేంద్రం ఆలస్యం చేయలేదని చెప్పారు. 2015-16 నుంచి జాతీయ సంస్థల కోసం ఫండ్స్ రిలీజ్ చేసి, ఆ తర్వాత ఏడాది నిధులు వచ్చాయని, కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం కదలనివ్వలేదన్నారు. మరో బీజేపీ నేత మాట్లాడుతూ.. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. 2019లో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఏపీ అభివృద్ధికి మరోసారి సహకరిస్తామని, ఏపీ అభివృద్ధికి సైంధవుడిలా మారిన చంద్రబాబుకు బుద్ధి చెబుతామని అన్నారు.
అమరావతి పేరుతో బిజినెస్.. కన్నా
ఏపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంతో చేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు మాత్రం అమరావతి పేరిట బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి పదేళ్లలో రావాల్సిన వాటిలో 80 శాతం ప్రాజెక్టులను ఇప్పటికే ఇచ్చారని చెప్పారు. జన్మభూమి కమిటీ మొదలు చంద్రబాబు, నారా లోకేష్ వరకు అందరూ దోచుకుంటున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా దొరికిపోయారని ధ్వజమెత్తారు. అందుకే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఏపీ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. 2014లో చంద్రబాబు మాటలు విని మోసపోయామని, మరోసారి మోసపోవద్దన్నారు. యూటర్న్ సీఎంను నమ్మవద్దన్నారు.
వందలాది బస్సులలో గాలి తీసి ఆపేసిన టీడీపీ కార్యకర్తలు
గుంటూరు, శంకరవిలాస్ తదితర చోట్ల టీడీపీ కార్యకర్తలు దుర్మార్గంగా యాభై, యాభై చొప్పున బస్సులను అడ్డుకున్నారని, బస్సుల్ల గాలి తీసి అపేశారని సోము వీర్రాజు చెప్పారు. ఏపీ అభివృద్ధికి రూ.9వేల కోట్లు ఇచ్చారని బీజేపీ నేతలు చెప్పారు.
టీడీపీ నిరసనలు
టీడీపీ కార్యకర్తలు గో బ్యాక్ మోడీ అంటూ నిరసనలు తెలిపారు. ఏపీకి అన్యాయం చేసి ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు. తిరుపతిలో మోడీకి వ్యతిరేకంగా మంత్రి నారా లోకేష్ నల్ల చొక్కాలతో నిరసన తెలిపారు. మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.