గందరగోళం: సుజన నిలదీత, డెడ్లైన్, మోడీకి తెలుసని కేంద్రమంత్రి అనంత్
Recommended Video
న్యూఢిల్లీ: టీడీపీ, వైసీపీ ఎంపీలు లోకసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని, విభజన హామీలపై నిర్దిష్ట కాలపరిమితి కావాలని నిరస వ్యక్తం చేశారు. ఎంపీలు వెల్లోకి వెళ్లారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలపై లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ఏపీ అంటే లెక్కలేదా: మోడీకి బాబు మరో షాక్, బంద్పై యూటర్న్, కానీ, గల్లాకు 'ప్రత్యేక' ప్రశంస
ఓ దశలో టీడీపీ ఎంపీలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మీరు నినాదాలు చేస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని, నిరసన తెలపవచ్చు కానీ, నినాదాలు చేయవద్దని హితవు పలికారు. ఎంపీలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలన్నారు. క్రమశిక్షణ తప్పితం చర్యలు తప్పవన్నారు. ఎంపీ శివప్రసాద్ తప్పెటగుళ్ల వేషధారణలో నిరసన తెలిపారు. ఆయన సభలో దానిని వాయించే ప్రయత్నం చేశారు.
చదవండి: వాళ్లకంటే పెద్ద మోసగాళ్లు: మోడీపై టీడీపీ, బీజేపీని మరోసారి ఏకేసిన గల్లా జయదేవ్
15 రోజుల్లో ప్రకటన చేయాలి
లోకసభలో సుజనా చౌదరి మాట్లాడుతూ.. విభజన సమస్యలపై 15 రోజుల్లో ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఈ అంశంపై రెండు గంటల పాటు ప్రత్యేక చర్చకు అనుమతించాలని కోరారు. ఏపీ అనేక సమస్యలతో ఆందోళన చెందుతోందన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉంటూ సహచర మంత్రికి సూచన చేస్తున్నానని చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి అనంత్ కుమార్ స్పందించారు.
అనంత్ కుమార్ ఇలా, ఆవేదన, ఆందోళన అర్థం చేసుకున్నాం
విభజన సమస్యలపై కేంద్రం సానుకూలంగా ఉందని ఏపీ మంత్రులు, సభ్యులు గ్రహించాలని అనంత్ కుమార్ అన్నారు. ఏపీ ప్రజల ఆందోళనను, ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. సుజనా చౌదరి లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. బడ్జెట్పై ప్రసంగం సమయంలో ఆర్థిక మంత్రి ఏపీ విభజన అంశాలపై మాట్లాడుతారని చెప్పారు.
అప్పుడే ఆందోళన విరమిస్తారు
అనంత్ కుమార్ మాట్లాడిన తర్వాత తిరిగి సుజన స్పందిస్తూ.. ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సమయంలో కచ్చితమైన హామీ ఇస్తే మా సహచరులు (టీడీపీ ఎంపీలు) ఆందోళనను విరమిస్తారని తేల్చి చెప్పారు. వచ్చే బడ్జెట్ సమావేశాల వరకు తాము సమయం ఇస్తామని కూడా సుజన చెప్పినట్లుగా తెలుస్తోంది.
అందుకే సలహా ఇస్తున్నా
ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసమే తాను సలహా ఇచ్చానని సుజనా చౌదరి అన్నారు. హోదా, రైల్వే జోన్ వంటి అంశాలు పెండింగులో ఉన్నాయన్నారు. ఏపీ సమస్యల పట్ల, ఏపీ ప్రజల పట్ల ప్రధాని మోడీ చాలా సానుకూలంగా ఉన్నారని అనంత్ కుమార్ అన్నారు. అన్ని సమస్యలకు కచ్చితమైన పరిష్కారం ఉంటుందన్నారు.
జైట్లీ, అమిత్ షాలతో సుజన భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్న బంద్, ఆందోళనల గురించి వారికి వివరించారు. విభజన చట్టంలోని అంశాలను వారి దృష్టికి తీసుకు వెళ్లారు.