గంగాశుద్ధికి శాఖ: ముందే ఉమాభారతి ట్వీట్, తొలగింపు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గంగానది శుద్ధికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. గంగానది ప్రక్షాళన బాధ్యతను ఉమాభారతికి ఇచ్చే అవకాశాలున్నాయి. గంగానది ప్రక్షాళనపై ఎన్నికల ప్రచారంలో మోడీ ఇచ్చిన ఇచ్చిన విషయం తెలిసిందే. గంగా మాత తనను పిలిచిందని నామినేషన్ పత్రాల దాఖలు రోజునే వారణాసి ప్రజలను ఆకట్టుకున్నారాయన.
మరోవైపు గంగానది పుట్టిన గంగోత్రి నుంచి.. ఆ పవిత్ర నది సాగరంలో సంగమించే గంగాసాగర్ దాకా.. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరముందంటూ ఉమాభారతి ఉద్యమించారు. ఈ నేపథ్యంలో మోడీ... జలవనరుల శాఖకు గంగా ప్రక్షాళన కూడా జోడించి మరీ ఉమాభారతికి కేటాయించారు.
కాలుష్యంతో, ఇసుక అక్రమ తవ్వకాలతో కునారిల్లుతున్న గంగానదిని కాపాడాలంటూ మొదలైన 'సేవ్ గంగా' ఉద్యమంలో ఉమాభారతి కీలకపాత్ర పోషించారు. 2011లో సోనియా గాంధీని సైతం కలిసి ఆమె సహాయం కోరారు. ఇక, మోడీ వారణాసి నుంచి పోటీ చేయాలని నిశ్చయించుకోగానే ఈ అంశాన్నే తెరపైకి తెచ్చి కాశీవాసుల హృదయాలను సగం గెలుచుకున్నారు. అలాంటిది ఇప్పుడు మోడీ ప్రధాని, ఉమాభారతి గంగా ప్రక్షాళన మంత్రి అయ్యారంటే గంగమ్మ శుద్ధి సాధ్యమేనని ఆ నదీతీరవాసులు భావిస్తున్నారు.
ట్విటర్లో ముందే కూత
ఈ విషయమై ఉమాభారతి ట్విట్టర్లో ముందే స్పందించారు. ఉమాభారతి పోర్ట్ఫోలియో గురించి అధికారిక ప్రకటన వెలువడక ముందే ఆమె సిబ్బంది ఉమ ట్విటర్ ఖాతాలో ఆ విషయాన్ని పోస్ట్ చేసేశారు. "కేంద్ర కేబినెట్ మంత్రిగా.. జలవనరులు, గంగా ప్రక్షాళన మంత్రిత్వ శాఖ పొందాను'' అని ఆమె పేర్కొన్నట్టుగా ట్వీట్ చేశారు. కానీ, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం అలా ముందుగానే వెల్లడించడం తప్పని తెలియగానే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు.