టిట్లీ తుఫాను: చంద్రబాబుకు మోడీ ఫోన్, పరిస్థితిపై ఆరా
విశాఖపట్నం: టిట్లీ తుఫాను కోస్తా ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించిన నేపథ్యంలో గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. టిట్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
టిట్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబును శుక్రవారం పర్యటించనున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం బయల్దేరిన సీఎం.. జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గురువారం రాత్రి శ్రీకాకుళం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తొలుత విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ అందుబాటులో ఉన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మరోవైపు టిట్లీ తుఫాను నష్టంపై శ్రీకాకుళం జిల్లా అధికారులు నివేదికను సిద్ధం చేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
హుధుద్ కంటే టిట్లి సైక్లోన్ ప్రభావమే ఎక్కువ, కానీ: 8 మంది మృతి, ఫోన్ నెంబర్లు ఇవే
జిల్లాలోని 38 మండలాల్లోనూ తుపాను ప్రభావం ఉందని, ముఖ్యంగా 12 మండలాల్లోని 196 గ్రామాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 1.39లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. జిల్లాలో 509 ఇళ్లు పాక్షికంగా.. 122 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. జిల్లాలో 15 పునరావాస కేంద్రాల్లోకి 3వేల మందిని తరలించారు. 300 కి.మీ మేర రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Recommended Video