మోడీ నోట బాహుబలి మాట.. బాబుది భళ్లాలదేవుడి తత్వం : మోడీ
రాజమహేంద్రవరం: రాష్ట్రానికి గుండెకాయ వంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రజలను దారుణంగా మోసానికి గురి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని ఆయన గుర్తు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం పూర్తి కావాలంటే.. కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని మోడీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చేశారని, దాన్నుంచి డబ్బులు పిండుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
బాలయపై సైరా పంచ్: కరెంటు షాక్ పెట్టినా.. వ్యాధి ఇంకా నయం కానట్టుంది!
పోలవరానికి కేటాయించిన ఏడు వేల కోట్లు ఏం చేశారో చెప్పే దమ్ముందా?
పోలవరం ప్రాజెక్టు నాలుగు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాల మధ్య నలుగుతూ వస్తోందని మోడీ అన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు అవసరాన్ని తాము గుర్తించామని, అందువల్లే కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని చెప్పారు. ఇప్పటిదాకా సుమారు 7000 కోట్ల రూపాయలను తాము చంద్రబాబు ప్రభుత్వానికి మంజూరు చేశామని అన్నారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో నిజాయితీగా చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా? అని మోడీ నిలదీశారు.
అంచనాలను పెంచి, నిధులను మెక్కుతున్నారు..
పోలవరం ప్రాజెక్టును తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేయాలని అనుకోవట్లేదని మోడీ విమర్శించారు. తాము పంపించిన నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వాటిని పక్కదారి పట్టించి, మెక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్దేశపూరకంగా పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనా నిర్మాణాలను గణనీయంగా పెంచేశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు టీడీపీకి, చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని అన్నారు. ఏటీెఎం నుంచి డబ్బులు రాబట్టుకున్నట్టు నిధులను దుబారా చేస్తోందని నిప్పులు చెరిగారు. కమిషన్ల కోసం అంచనాలను భారీగా పెంచేశారని చెప్పారు.
యూటర్న్ బాబూ! ఎవరికి లబ్ది చేకూరుస్తున్నారు!
యూటర్న్ బాబు ఎవరికి లబ్ది చేకూర్చడానికి పోలవరం అంచనాలు పెంచేస్తున్నారని మోడీ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలవరం నిధులను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలవరానికి ఖర్చు చేయాల్సిన నిధులను తీసుకెళ్లి, కొత్తగా ఏర్పడిన రాజకీయ మిత్రుల చేతుల్లో పోస్తున్నారని మోడీ విమర్శించారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అవినీతికి పోలవరం ప్రాజెక్టు అతి పెద్ద ఉదాహరణ అని చెప్పారు. ఇలాంటి మోసగాళ్ల నుంచి ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే.. రాష్ట్రం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నారు.
చంద్రబాబుకు స్టిక్కర్లు అతికించడమే పని!
యూటర్న్ బాబుకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించేంత తీరిక లేదని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలపై స్టిక్కర్లను అతికించడమే చంద్రబాబు పని అని, పాపం ఆయన స్టిక్కర్లను అతికించడంలో తీరిక లేకుండా గడుపుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. తాము ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకంపైనా చంద్రబాబు తన స్టిక్కర్ అతికించుకున్నారని అన్నారు. మత్స్యకారుల కోసం 70 ఏళ్ల భారత చరిత్రలో.. తొలిసారిగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామని, ప్రత్యేక బడ్జెట్ ను అమలు చేశామని చెప్పారు.
చంద్రబాబు అండ్ కో ప్రకటనలతో.. పాకిస్తాన్ పండగ చేసుకుంటోంది..
పుల్వామా ఉగ్రదాడి అనంతరం తాము చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ 2పై చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ సహా మహా కూటమి పార్టీలు చేసిన వ్యాఖ్యలు మన దేశ జవాన్లను కించపరిచాయని మోడీ అన్నారు. చంద్రబాబు, ఆయన సహచర నాయకులు చేసిన వ్యాఖ్యానాలపై పాకిస్తాన్ పండగ చేసుకుంటోందని చెప్పారు. భారత్ లో కూడా తమను సమర్థించే వాళ్లు ఉన్నారని పాక్ ప్రభుత్వం సంబర పడుతోందని చురకలు అంటించారు. తాము ఉగ్రవాదుల ఇంట్లో దూరి కొట్టామని, అయినప్పటికీ.. మహాకూటమి నాయకులు సాక్ష్యాలు అడుగుతున్నారని అన్నారు.
జగన్ పైనా మోడీ విసుర్లు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ వదల్లేదు మోడీ. ఆయనపైనా విమర్శలు చేశారు. టీడీపీ గానీ, జగన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ గానీ.. ఆధునికాంధ్రను, నవ్యాంధ్రను నిర్మించలేరని అన్నారు. ఆయా నాయకులంతా అవినీతిలో పడి కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. తన నిజాయితీని, పనితీరును చూసి బీజేపీకి ఓటు వేయాలని అన్నారు.
ప్రాజెక్టుల మంజూరు కేంద్రం ఘనతే..
కాకినాడలో కొత్తగా ఏర్పాటైన పలు ప్రాజెక్టులను తామే మంజూరు చేశామని అన్నారు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా ఇచ్చింది తమ ప్రభుత్వమేనని మోడీ అన్నారు. సాగరమాల, జలమార్గాలు, జాతీయరహదారులు, రైల్వేలు, ఎయిర్ వేస్ ఇవన్నీ తమ ఎన్డీఏ ప్రభుత్వమే రాష్ట్రానికి కేటాయించిందని చెప్పారు. అంతేగానీ- ఆయా ప్రాజెక్టుల వ్యవహారాల్లో చంద్రబాబు ప్రభుత్వ పాత్ర ఏ మాత్రం లేదని అన్నారు.
మధ్య తరగతికి పన్నుల నుంచి ఊరట
అయిదు లక్షల రూపాయల వరకు పన్ను చెల్లింపులను మినహాయించామని, దేశ చరిత్రలో ఇది చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. కోట్లాదిమంది మధ్య తరగతి ప్రజలకు పన్ను చెల్లింపుల పరిధి నుంచి తప్పించామని అన్నారు. మధ్య తరగతి ప్రజల ఈ డిమాండ్ ను ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చలేకుండా పోయిందని అన్నారు. ఈ అయిదేళ్లలో ఒక్క రూపాయి కూడా అదనపు పన్ను విధించలేదని అన్నారు. పైగా- పన్నులను తగ్గిస్తూ వస్తున్నామని చెప్పారు.
భళ్లాల దేవునిలా తయారైన చంద్రబాబు..
అగ్రవర్ణాల పేదల కోసం రిజర్వేషన్ వల్ల ఏపీలో చాలామంది లబ్ది పొందారని మోడీ తెలిపారు. యూటర్న్ బాబు స్థితి.. భళ్లాల దేవుని తరహాలో తయారైందని మోడీ విమర్శించారు. భల్లాల దేవుని తరహాలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అనేక కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. ఏదోరకంగా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, నమ్మించి మోసం చేశారని మోడీ విమర్శించారు.టీడీపీ సైబర్ క్రైమ్ లకు పాల్పడుతోందని అన్నారు. సేవా మిత్ర యాప్.. ద్వారా అక్రమాలు చేస్తోందని చెప్పారు. టీడీపీ ఎవరికీ సేవ చేయట్లేదని, వారు ఎవరికీ మిత్రులు కాదని చెప్పారు. పెద్ద ఎత్తున డేటాను చోరీ చేస్తున్నారనే సమాచారం తన వద్ద ఉందని అన్నారు. ఈ డేటా చోరీ వల్ల రాష్ట్ర భద్రత ప్రమాదంలో పడినట్టేనని చెప్పారు.