ప్రత్యేక హోదా: మోడీపై బాలకృష్ణ నమ్మకం, అదే కారణమని అశోక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపైన తనకు నమ్మకం ఉందని, త్వరలోనే హోదాపై ప్రకటన వస్తుందని భావిస్తున్నామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రధానిమంత్రితో ఈ విషయం మాట్లాడారని చెప్పారు. తన పైన, తన కుటుంబం పైన అభిమానం చూపుతున్న అనంతపురం వాసులకు ఆయన కృతజ్ఞత తెలిపారు. ధర్మవరంలో చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నిర్ణయం తీసుకోకపోవడానికి పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులే కారణమని కేంద్రమంత్రి అశోక గజపతిరాజు వేరుగా అన్నారు.
ప్రధాని మోడీ తొలి ఏడాది పాలనలో సామాజిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సాంకేతిక కారణాల వల్లే ప్రత్యేక హోదా ఆలస్యమవుతోందన్నారు. ఒక్క ఏడాదిలోనే అన్ని జరిగిపోవన్నారు.
మోడీది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. మిత్ర పక్షాలను సంప్రదించిన తర్వాతే మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఏపీలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించి తీరుతామన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు.
రైతులపై మోడీకి కక్ష లేదని, రైతుకు ఏ విధంగా లాభం చేకూర్చాలని ఆయన ఆలోచిస్తారని, పేదలు, రైతుల పక్షాన ఆయన నిలబడుతున్నారన్నారు. ఐదేళ్ల తర్వాత లోటు బడ్జెట్ ఉన్న రాష్ర్టాలు మూడే ఉంటాయని, అవి ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ అన్నారు.