విశాఖ రైల్వే జోన్ ‘పరిశీలన’కే పరిమితమా?: కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రైల్వే శాఖ గత నాలుగేళ్లలో చేపట్టిన పథకాలు తదితర అంశాలపై మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్.. విశాఖ రైల్వే జోన్ అంశంపైనా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేవలం రైల్వే జోన్ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందని చెప్పారు. ప్రస్తుతం మంత్రిత్వశాఖ పరిధిలోనే ఆ అంశం ఉందని తెలిపారు. తాను కూడా ఆ అంశాన్ని ఇప్పటికీ పరిస్తూనే ఉన్నానని మంత్రి తెలిపారు.
అంతేగాక, ఇదే విషయాన్ని గత పార్లమెంటు సమావేశాల్లోనూ చెప్పానని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గుర్తు చేయడం గమనార్హం. తొలుత ఒడిశా ఒప్పుకోవడం లేదని కేంద్రం చెప్పగా.. ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలు జోన్ అంశాన్ని మరింత సందిగ్ధతలోకి నెట్టింది. కాగా, విశాఖ రైల్వే జోన్ కోసం ఇప్పటికే ఏపీలో పలుమార్లు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.