ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం: ఉప ఎన్నికలకు నో ఛాన్స్, బస్సుయాత్ర
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఏప్రిల్ 6వ తేదీన వీరు ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం రాజీనామా చేశారు. రెండు నెలలకు పైగా పరిశీలించిన స్పీకర్ ఇప్పుడు ఆమోదించారు. బుధవారం(20 జూన్ 2018)న రాజీనామాలు ఆమోదించినట్లు ఉత్తర్వులు వచ్చాయి.
Recommended Video
మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. స్పీకర్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి రాజీనామాలు నిన్నటి (బుధవారం) నుంచి అమలులోకి వచ్చాయి. అయితే ఎన్నికలకు ఏడాదిలోపు ఉండటంతో ఉప ఎన్నికలు రావని చెబుతున్నారు. ఎంపీలు బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు.
రాజీనామాల కోసం వైసీపీ ఎంపీలు స్పీకర్ను రెండుమూడు సార్లు కలిశారు. ఈ నెల 6వ తేదీన కూడా ఆమెను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని చెప్పారు. కానీ స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు ఆమోదించారు.
జూన్ 6న వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ రాజీనామాలను ఆమోదించారని తెలిపారు. అలాగే, పార్టీ మారిన మరో ముగ్గురు తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.