భారీ వర్షాలు: ముంబై-విజయవాడ విమానానికి తప్పిన ప్రమాదం
ముంబై: విజయవాడ విమానానికి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. భారీ వర్షాల కారణంగా ముంబై అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే. పలు రైళ్లను రద్దు చేశారు. రోడ్లు నీటి మడుగులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం, ఆగిన డబ్బావాలా సేవలు(ఫోటోలు)
విజయవాడ నుంచి ముంబై ప్రయాణిస్తున్న విమానానికి మంగళవారం ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో రన్ వే పైన దిగింది.
ఈ క్రమంలో విమానం అదుపు తప్పి రన్ వే పైన జారింది. ఈ ఘటనలో ప్రయాణీకులు ఎవరికీ ఏమీ జరగలేదు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇంజినీర్లు హుటాహుటిన వచ్చి విమానాన్ని పరిశీలించారు.
ముంబైలో వర్షాల కారణంగా ఇటీవల 108 విమానాలను రద్దు చేశారు. జెట్ ఎయిర్ వేస్కు చెందిన 63, ఇండిగోకు చెందిన 8, స్పైస్ జెట్కు చెందిన 3, గో ఎయిర్కు చెందిన ఓ విమానాన్ని రద్దు చేశారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రధాన రన్ వేను బుధవారం వరకు మూసివేశారు.