మోడీ పలకరింపు, సుజనా వ్యాఖ్యలు: వైఎస్ జగన్తో భేటీపై రఘురామ కృష్ణరాజు క్లారిటీ
అమరావతి: పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ తనను అప్యాయంగా పలకరించడంపై జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వివరణ ఇచ్చారు. నరేంద్ర మోడీ గుర్తుపట్టి పలకరిస్తేనే తాను ఆయన దగ్గరకు వెళ్లానని ఆయన చెప్పారు.
ప్రధాని మోడీతో భేటీపై..
ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఎలాంటి వేరే ఉద్దేశం లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టకముందే తనకు తెలుసని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ను కలిశానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మోడీ తనను పలకరించడానికి, పార్టీ గీత దాటి పోవడానికి సంబంధం లేదని వివరించారు.
ఆ విషయంపై సుజననే అడగాలి..
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను ఆయన్నే అడగాలని మీడియా ప్రతినిధులకు రఘురామ కృష్ణంరాజు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరూ కూడా బీజేపీతో టచ్లో లేరని వెల్లడించారు. ఒక్క ఎంపీ కూడా పార్టీ గీత దాటి వెళ్లరని స్పష్టం చేశారు. అందరికీ జగన్ అంటే ఇష్టం, గౌరవం ఉందని ఆయన తెలిపారు. కాగా, పలువురు వైసీపీ ఎంపీలు బీజేపీకి టచ్లో ఉన్నారంటూ సుజనా చౌదరి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డితో..
శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నరసాపురం నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి సీఎం వద్దకు వెళ్లానని చెప్పారు. వశిష్ట వారధి ప్రారంభోత్సవం పెండింగ్లో ఉందని, ఆ అంశంతోపాటు మిగిలిన సమస్యలపై సీఎంతో చర్చించానని చెప్పారు. స్నేహపూర్వక వాతావరణంలో నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చలు జరిపామని తెలిపారు.
సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరణ
పార్లమెంట్లో చర్చ సందర్భంగా తెలుగు అభివృద్ధికి ఎంత ప్రాధాన్యమిస్తున్నామనే అంశాన్ని తాను వివరించినట్లు చెప్పిన రఘురామ కృష్ణరాజు.. తెలుగు మాధ్యమం గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. మాధ్యమం వేరు.. భాష వేరు అని అన్నారు. ఈ అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ అడగలేదని తెలిపారు. సమాచార లోపం ఉండకూడదనే తాను చెప్పినట్లు తెలిపారు.