గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా కీర్తిస్తోన్న జనసేన: ఆర్ఎస్ఎస్ను ప్రసన్నం చేసుకోవడానికేనా?
అమరావతి: జనసేన పార్టీ రూటు మార్చిందా? భారతీయ జనతా పార్టీకి దగ్గర కావడానికి ప్రయత్నాలను కొనసాగిస్తోందా? దీనికోసం ఈ సారి ఏకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఇతర సంఘ్ పరివార్ నాయకులను ప్రసన్నం చేసుకునే దిశగా తన రూటు మార్చిందా? అంటే అవుననే చెప్పుకోవచ్చు. దీనికి కారణం లేకపోలేదు. జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటోంది జనసేన పార్టీ. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
కరోనా బారిన ఏపీ: ఇప్పటిదాకా 52 మంది మృత్యువాత: చిత్తూరుజిల్లాలో తొలి మరణం: భారీగా కేసులు
గాడ్సే జయంతికి నివాళి అర్పిస్తూ..
మంగళవారం నాథూరామ్ గాడ్సే జయంతి. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని నాగేంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. నేడు నాథూరామ్ గాడ్సే జయంతి అని, ఆయన నిజమైన దేశభక్తుడు అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీని కాల్చి చంపడం అనేది కరెక్టా? కాదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. గాడ్సే దేశభక్తిని శంకించలేమని చెప్పారు. అప్పట్లో ఏ మీడియా కూడా గాడ్సేకు అనుకూలంగా ఎలాంటి చర్చలను పెట్టలేదని, దీనికి కారణం.. మీడియా ప్రభుత్వానికి లోబడి పని చేయడమే కారణమనీ అన్నారు. దానివల్లే మహాత్ముడిని గాడ్సే కాల్చి చంపడంపై ఎవరూ డిబేట్లు పెట్టలేదని అన్నారు.
చరిత్ర తనను దోషిగా గుర్తిస్తుందని తెలిసినా..
గాడ్సే వాదనలను వినిపించడానికి ఏ మీడియా కూడా ముందుకు రాలేదని అన్నారు. మహాత్మాగాంధీని చంపడం వల్ల అపఖ్యాతి పాలవుతానని తెలిసి కూడా నాథూరామ్ గాడ్సే తాను అనుకున్నది చేశాడని నాగబాబు పేర్కొన్నారు. అలాగని ఆయన దేశభక్తిని తాము ఏ మాత్రం శంకించలేమని స్పష్టం చేశారు. ఆయన నిజమైన దేశభక్తుడని నివాళి అర్పించారు. గాడ్సే ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. పాపం నాథూరామ్ గాడ్సే అని ఆవేదనను వ్యక్తం చేశారు.
జనసేన వైఖరికి అద్దం పట్టేలా
తాజాగా నాగేంద్రబాబు చేసిన ఈ ట్వీట్.. జనసేన పార్టీ వైఖరికి అద్దం పట్టేలా ఉందని అంటున్నారు. నిజానికి- నాగబాబు జనసేన పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు. పైగా తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు కొద్దిరోజుల కిందటే వెల్లడించారు కూడా. అదే సమయంలో నాథూరామ్ గాడ్సే జయంతి సందర్భంగా ఆయనను నిజమైన దేశభక్తుడిగా నివాళి అర్పిస్తూ ట్వీట్ చేయడం వ్యూహాత్మకంగానే భావిస్తున్నారు. బీజేపీకి మరింత చేరువ కావడానికి చేస్తోన్న ప్రయత్నాల్లో ఇదీ ఒకటి అయ్యుండొచ్చని అంటున్నారు.
ఆర్ఎస్ఎస్ పెద్దల కంట్లో పడేలా..
ఆర్ఎస్ఎస్, ఇతర సంఘ్ పరివార్ నాయకులు కూడా నాథూరామ్ గాడ్సేను సమర్థించిన సందర్భాలు లేకపోలేదు. బీజేపీ లోక్సభ సభ్యురాలు సాధ్వీ ప్రజ్ఙాసింగ్ ఠాకూర్ అచ్చం ఇలాంటి వ్యాఖ్యలను చాలా సందర్భాల్లో వినిపించారు. నాథూరామ్ గాడ్సేను నిఖార్సయిన దేశభక్తుడిగా పేర్కొన్నారు. నాగబాబు కూడా అదే తరహాలో గాడ్సేపై కామెంట్లను చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ట్వీట్ పట్ల జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీ పరంగా ట్వీట్లను చేసే సమయంలో వెనుకా ముందు ఆలోచించుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా కార్యకర్తలు సూచిస్తున్నారు.