"చంద్రబాబు డబ్బు రాజకీయాలను వైఎస్ నాయకత్వ పటిమ ఓడించింది"
విజయవాడ : ఏపీ పాలిటిక్స్ గురించి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్కు, ప్రస్తుత సీఎం చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా గురించి చెబతూ.. వైఎస్ తన నాయకత్వ పటిమతో సీఎం అయితే, చంద్రబాబు నోట్ల కట్టలతో సీఎం అయ్యారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఖర్చు చేయాల్సిన డబ్బు గురించి ఎమ్మెల్యేలు ఆందోళన చెందవద్దని, ప్రతీ అభ్యర్థికి రూ.10కోట్లు ఇస్తామని చంద్రబాబు బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బు రాజకీయాలను వైఎస్ నాయకత్వ పటిమతో తాము ఓడిగించగలిగామని చెప్పారు దిగ్విజయ్. తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్న నిర్మాణ కంపెనీలను పక్కనబెట్టి.. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారని బాబును విమర్శించారు.
దేశంలో మంచి సాంకేతికను ఉపయోగించుకుని ముందుకుపోతున్న అనేక నిర్మాణ కంపెనీలున్నాయని, నాగార్జున సాగర్ లాంటి డ్యాంలు కట్టిన భారతీయ కాంట్రాక్టర్లను చంద్రబాబు అవమానిస్తున్నారని దిగ్విజయ్ పేర్కొన్నారు. భారతీయులు కేవలం డ్రెయిన్లు మాత్రమే కట్టగలరని చంద్రబాబు పేర్కొనడం ఆయన ఆలోచనా ధోరణికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలోను కేంద్రంలో ఉన్న బీజేపీతో చంద్రబాబు రాజీపడుతున్నారని అసంత్రుప్తి వ్యక్తం చేశారు.
ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి గురించి ప్రస్తావిస్తూ.. పటేల్ జయంతిని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. పటేల్ ను ఓ ఆర్ఎస్ఎస్ నేతగా చూపించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అక్టోబర్ 31వ తేదీన ఇందిర వర్దంతి సందర్బంగా.. జాతీయ సమగ్రతా దినంగా గత ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటి ప్రభుత్వం దాన్నో వివాదం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
మహాత్మాగాంధీ కళ్లజోడును స్వచ్చ భారత్ కు ఉపయోగించుకుంటుండడాన్ని తప్పుబట్టిన దిగ్విజయ్.. ఆయనో శాంతి ప్రవక్త అన్న విషయం బీజేపీ మరిచిపోతుందని స్పష్టం చేశారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ లు ఎంతసేపూ తమ కార్యక్రమాలను హైలైట్ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు.