విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై కేంద్రానికి, రాష్ట్రానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ దుర్ఘటనపై హై పవర్ కమిటీని వేసి దర్యాప్తు సాగిస్తుంది. కేంద్రం సైతం కేంద్ర బృందాలను రంగంలోకి దించి పరిస్థితిని నార్మల్ గా మార్చటానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను సమీక్షిస్తుంది. ఇదే సమయంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీనిపై దృష్టి సారించింది.
Recommended Video
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసులు
ఇక ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ ఘటనపై వివరణ కోరుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. నిన్న విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లో గ్యాస్ లీక్తో జరిగిన ఘటనలో విషవాయువులు పీల్చి వేలాది మంది అస్వస్థులయ్యారు. ఇక ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 2000 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వందల సంఖ్యలో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు .స్టైరీన్ లీక్ వల్ల వెలువడిన విష వాయువులను పీల్చిన చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
ప్రాణ నష్టం కోసం రూ .50 కోట్ల మధ్యంతర మొత్తాన్ని ఇవ్వాలని ఆదేశం
ఇక ఈ ప్రమాదాన్ని సీరియస్గా తీసుకున్న జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్రం, ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఘటనకు సంబంధించి వివరణ కోరింది . శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ప్రాణ నష్టం కోసం రూ .50 కోట్ల మధ్యంతర మొత్తాన్ని సమర్పించాలని ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతే కాదు ఓ కమిటీ వేసి దర్యాప్తుకు ఆదేశించింది .
గ్యాస్ లీక్ ఘటన పై విచారణకు కమిటీ
ఎన్జిటి చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ బి శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీ దర్యాప్తు చేసి విచారణ జరిపి నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ కు మే 18 లోపు నివేదిక సమర్పించనుంది . ఇక ఈ కమిటీ ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధ్యయనం చేస్తుంది. అంతే కాదు అక్కడి ప్రమాద బాధితుల జీవితం, ప్రజారోగ్యం మరియు పర్యావరణానికి ఎంతవరకు నష్టం జరిగిందనే దాని గురించి కూడా అధ్యయనం చేస్తుంది.
సుమోటోగా గ్యాస్ లీక్ ఘటన .. జిల్లా మేజిస్ట్రేట్ వద్ద రూ .50 కోట్లు జమ
దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్ ఇండియా సంస్థలో మే 7 న ప్రమాదకర వాయువు లీకేజ్ జరిగిందని మీడియా నివేదికల ఆధారంగా ఈ విషయాన్ని ఎన్జిటి సుమోటోగా తీసుకుంది. ఇక అంతేకాదు ఎల్జి పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం జిల్లా మేజిస్ట్రేట్ వద్ద రూ .50 కోట్లు జమ చేయమని నిర్దేశించామని,సంస్థ యొక్క ఆర్ధిక విలువ మరియు నష్టం యొక్క పరిధికి సంబంధించి ఈ మొత్తాన్ని నిర్ణయించడం జరుగుతుంది అని ధర్మాసనం తెలిపింది.