జగన్ డ్రీమ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్: స్టే ఎత్తివేత.. టెండర్ల ప్రక్రియకు ఓకే: కేంద్రానికి నోటీస్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల్లో కదలికలు కనిపించనున్నాయి. నిర్మాణ పనులను కొనసాగించడానికి బ్రేక్ వేస్తూ ఇదివరకు ఇచ్చిన స్టేను నేషనల్ గ్రీన్ ట్రుబ్యునల్ (ఎన్జీటీ) ఎత్తేసింది. ఈ పథకం నిర్మాణానకి అవసరమైన ప్రాథమిక పనులను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీనికి అవసరమైన టెండర్ల ప్రక్రియను కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
గవర్నర్ కోటాలో మండలికి ఆ ఇద్దరు వైసీపీ నేతలు? మర్రి రాజశేఖర్తో పాటు పశ్చిమ నేత పేరు ఖాయం?
కేంద్రానికి నోటీసులు..
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది ఈ ట్రిబ్యునల్. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వీలుగా పర్యావరణ అనుమతులను మంజూరు చేయాల్సిన అవసరం ఉందా? లేదా? అనే విషయన్ని స్పష్టం చేయాలని పేర్కొంది. అప్పటిదాకా ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చేనెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిర్మాణం విషయంలో పర్యావరణ అనుమతుల అవసరం ఉందా? లేదా? అనే విషయంపై ఆగస్టు 11వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని గ్రీన్ ట్రిబ్యునల్కు వెల్లడించాల్సి ఉంటుంది.
ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన ట్రిబ్యునల్
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను రద్దు చేయించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. మలి విడత విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు, అధికారులు.. ఈ ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను అందజేశారు. ఈ ప్రాజెక్టు కొత్తగా నిర్మించ తలపెట్టినది కాదని స్పష్టం చేశారు. ఎలాంటి అదనపు కోటా నీటిని దీనికోసం వినియోగించుకోవట్లేదని వివరించారు. పాత ప్రాజెక్టులోనే కొద్దిపాటి డిజైన్ మార్పులను మాత్రమే కొత్తగా ప్రతిపాదించినట్లు స్పష్టం చేశారు.
సమగ్ర బ్లూ ప్రింట్
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీకి కేటాయించిన కోటా జలాలను సమర్థవంతంగా, సద్వినియోగం చేసుకోవడం, సముద్రంపాలవుతోన్న వృధా నీటిని మళ్లించడానికి మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి రూపొందించిన సమగ్ర బ్లూ ప్రింట్ను గ్రీన్ ట్రిబ్యునల్కు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు అనుగుణంగా.. ఆ ప్రభుత్వ అంగీకారంతో కేటాయించిన కోటా నీళ్లతోనే తాము ఈ ప్రాజెక్టును నిర్మించడానికి ప్రతిపాదనలను రూపొందించినట్లు చెప్పారు.
Recommended Video
సీమ జిల్లాల్లో 19 లక్షల హెక్టార్లకు నీటి సరఫరా కోసం
కృష్ణా జలాలపై నిర్మించిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించడానికి ప్రతిపాదనలను రూపొందించిన విషయం తెలిసిందే. దీన్ని నిర్మించాల్సి వస్తే.. పెద్ద ఎత్తున పర్యావరణానికి హాని కలుగుతుందని, ఎగువ ప్రాంతంలో ఉన్న తమకు అన్యాయం జరుగుతందంటూ తెలంగాణలోని నారాయణపేటకు చెందిన ఓ రైతు ఎన్జీటీలో పిటిషన్ వేశారు. ఈ పిటీషన్పై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. స్టే విధించింది. ఈ పథకం నిర్మాణంలో ఎలాంటి పనులను కూడా చేపట్టకూడదని ఆదేశించింది. తాజాగా ఈ స్టేను ఎత్తేసింది.