జాతీయ పార్టీగా టిడిపికి 'సైకిల్' చిక్కులు
హైదరాబాద్: జాతీయ పార్టీగా ముందుకు రావడానికి తెలుగుదేశం పార్టీకి చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తు కూడా దానికి అడ్డమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీగా టిడిపిని నిలబెట్టాలంటే సైకిల్ గుర్తును కాపాడుకోవడం కష్టమే అవుతుంది. సైకిల్ గుర్తును కాపాడుకోలేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. అందువల్ల సైకిల్ గుర్తును కాపాడుకుంటూ జాతీయ పార్టీ అవతరించేందుకు ఏ విధమైన అవకాశాలున్నాయనే కోణంలో టిడిపి సీనియర్ నేతలు ఆలోచనలు చేస్తున్నారు.
జాతీయ పార్టీగా అవతరించాలంటే తెలుగుదేశం పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలకు సైకిల్ చిహ్నం ఉంది. అందువల్ల ఇతర రాష్ట్రాల్లో ఆ గుర్తుతో పోటీ చేయడం సమస్యగా మారనుంది. జాతీయ స్థాయిలో సమాజ్వాదీ పార్టీకి సైకిల్ గుర్తు ఉంది. జాతీయ స్థాయిలో ఒకే గుర్తును ఎన్నికల కమిషన్ రెండు పార్టీలకు కేటాయించడం సాధ్యం కాదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైకిల్ గుర్తు అంటే టిడిపి అనేది పడిపోయింది. అందువల్ల తెలుగు మాట్లాడే ఈ రెండు రాష్ట్రాల్లో సైకిల్ గుర్తు లేకుండా పోటీ చేయడం టిడిపికి ఇష్టం ఉండదు. కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి వారు పూర్తిగా ఓటేస్తారని చెప్పడానికి లేదు. భాషా ప్రాతిపదికపై ఇతర రాష్ట్రాల ఓటర్లు టిడిపికి మద్దతు పలుకుతారా అనేది సందేహమే.
నిజానికి, తెలుగుదేశం పార్టీ పేరును భారతదేశం పార్టీగా మార్చడానికి గతంలో ఎన్టీ రామారావు ప్రయత్నాలు చేసినట్లు చెబుతారు .ప్రతిపక్షాలు దానికి వ్యతిరేకత ప్రదర్శించాయి. పార్టీని విమర్శించినప్పుడు దేశాన్ని విమర్శించినట్లు అవుతుందనే వాటి అభ్యంతరాల్లో ప్రధానమైంది. దాంతో ఎన్టీ రామారావు ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఎఐఎడిఎంకె మాదిరిగా ఆలిండియా తెలుగుదేశం పార్టీ పద్ధతిలో పేరు మార్చుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన పార్టీ వర్గాల్లో సాగుతోంది.
కాగా, టిడిపిని జాతీయ పార్టీగా చేయడానికి అవసరమైన చర్యలను, వ్యూహాలను ఖరారు చేయడానికి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. పార్టీ పేరు, చిహ్నం విషయాల్లో ఉన్న అడ్డంకులను తొలగించకోవడానికి కమిటీ న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం.