ఆ శవానికి ఆర్నెల్ల తర్వాత పోస్టుమార్టం... ఎందుకంటే?
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఒక నేర ఘటనకు సంబంధించి విచిత్రం చోటుచేసుకుంది. 6 నెలల క్రితం అంగళ్లు గ్రామ వాసి శెట్టి సీతారాంరెడ్డి చనిపోగా ఆయన గుండెపోటుతో మృతిచెంది నట్టు భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ తరువాత వేరే హత్య కేసుకు సంబంధించి పోలీసులు హంతకులను పట్టుకొనగా వారు పలు హత్యలు చేశారని, అందులో శెట్టి సీతారాంరెడ్డి మర్డర్ కూడా ఒకటని తెలిసింది.
దీంతో అవాక్కైన పోలీసులు శెట్టి సీతారాంరెడ్డి మృతదేహాన్నివెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శరీర భాగాలను తిరుపతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నట్లు ఇన్చార్జి రూరల్ సీఐ సురేష్కుమార్ వెల్లడించారు. అయితే ఆర్నెళ్ల తర్వాత కూడా శెట్టి సీతారాంరెడ్డి మృత దేహం చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ తాలుకూ నివేదిక మంగళవారం రానుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మదనపల్లెలో ఇటీవల జరిగిన హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారు సీతారాంరెడ్డిని కూడా హత్య చేసినట్టు అంగీకరించారు. ఆస్తి పంపకాలకు అడ్డుపడుతున్నాడన్న కారణంతో అతన్ని బంధువులు పథకం ప్రకారం హత్య చేయించినట్టు వెల్లడించారు. ఊరి బయటకు వాకింగ్కు వెళ్లిన ఆయనకు బలవంతంగా విషపు నీరు తాగించడంతో చనిపోయినట్లు వివరించారు.
పోలీసులు తహసీల్దార్ ఆధ్వర్యంలో గురువారం సీతారాంరెడ్డి మృతదేహాన్నివెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన శరీర భాగాలను తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఐదుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మంగళవారం నివేదిక అందిన తర్వాత దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు.