Analysis:నత్వానీ మామూలోడు కాదుగా..అందులో స్పెషలిస్ట్ :కేంద్రం..జగన్ మధ్య వారధిగా...!
అమరావతి: వైసీపీ నుండి రాజ్యసభకు ఎంపికైన పరిమళ్ నత్వానీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. జార్ఘండ్ నుండి రెండు సార్లు రాజ్యసభకు ఎంపికైన నత్వానీ..ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ మద్దతుతో పెద్దల సభలో అడుగు పెడుతున్నారు. ఏపీలో నాలుగు సీట్లు వైసీపీ నుండి వస్తుండటంతో..అమిత్ షా అటు నత్వానీ..ఇటు జగన్ కు చేసిన సూచన ఫలితంగా చిరవకు ఈ అభ్యర్ధిత్వం ఖరారైంది. నేరుగా ముఖేష్ అంబానీ తన నివాసానికి వచ్చి మరీ..నత్వానీకి రాజ్యసభ ఇవ్వాలని కోరటం..ఆ సమయంలో ముఖేష్ నుండి వచ్చిన హామీలు..భవిష్యత్ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని జగన్ నత్వానీకి ఓకే చేసారు. అయితే, ఇప్పుడు అటు వైసీపీలో సైతం ఈ నత్వానీ గురించి చర్చ జరుగుతోంది. ఆయనకు ముఖేష్ అంబానీతోనే కాదు.. మోదీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు. ఆ ఇద్దరినీ కష్టకాలంలో ఆదుకున్న వ్యక్తి. అసలు ఈ నత్వానీ గురించి తెలుసుకోవాలంటే...
నత్వానీ..ఆ ఇద్దరికీ కష్టకాలంలో
తాజాగా వైసీపీ మద్దతుతో రాజ్యసభకు ఎంపికవుతున్న పరిమళ్ నత్వానీది గుజరాత్ సొంత రాష్ట్రం. ఆయన ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షాకు ఎంత దగ్గరో..కాంగ్రెస్ కు అంత దూరం. ఆయన మోదీ, అమిత్ షాలకు సన్నిహితమైన కొద్దీ కాంగ్రెస్కూ, ముఖేష్ అంబానీకి మధ్య దూరం పెరగడమే దీనికి కారణం. దీరూభాయ్ అంబానీ కాలం నుంచి రిలయన్స్తో కాంగ్రెస్ నేతలు ఏర్పర్చుకున్న సంబంధాలను పరిమళ్ చెడగొట్టారని, బీజేపీ అధినాయకత్వానికి ముఖేశ్ అంబానీని సన్నిహితం చేశారని వారు వాపోతుంటారు. నత్వానీ ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకే తాము గతంలో పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న మురళీ దేవరను మార్చి జైపాల్ రెడ్డిని నియమించామని, ఆ శాఖలో నత్వానీకి సన్నిహితులైన అధికారులనూ మార్చేలా చూశామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, ఆ తర్వాత ముఖేశ్ స్వయంగా రంగంలోకి దిగడంతో జైపాల్ రెడ్డిని మార్చాల్సి వచ్చింది. 1997లో రిలయన్స్ గ్రూప్లో చేరిన నత్వానీ 2016 నాటికి రిలయన్స్ ఇండస్ర్టీస్ కార్పొరేట్ వ్యవహారాల గ్రూప్ అధ్యక్షుడయ్యారు.
మోదీ..షా..ముఖేష్ మధ్య సంధాన కర్తగా..
గుజరాత్ లోని జామ్నగర్ వద్ద పశ్చిమ కోస్తా తీరాన అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ నెలకొల్పడంలోనూ, భారీ ఎత్తున భూసేకరణలోనూ ఆయన కీలక పాత్ర పోషించడం ద్వారా ముఖేశ్, మోదీ, అమిత్ షా మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వైష్ణవీ కార్పొరేషన్ కమ్యూనికేషన్స్కు సంబంధించి నీరా రాడియో టేపుల్లోనూ నత్వానీ ప్రస్తావన ఉంది. గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోదీకి న్యాయసలహాలు అందించారని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. జార్ఖండ్ నుంచి రాజ్యసభకు నత్వానీ ఎన్నికవ్వాలనుకున్నప్పుడు ఆయనకు 24 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం కాగా, అమిత్ షా జోక్యంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఇప్పుడు కూడా అమిత్ షా సూచన వల్లే నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్ ఓకే చేసారు. అదే సమయంలో ముఖేష్ అంబానీ నేరుగా తన వద్దకు వచ్చి నత్వానీకి రాజ్యసభ కు అవకాశం ఇవ్వాలని కోరటం ద్వారా జగన్ కు ఒక రకంగా దేశ వ్యాప్తంగా ఇమేజ్ పెరిగింది. దీంతో..ఆయన సానుకూల నిర్ణయం తీసుకొన్నారు.
Recommended Video
అంబానీ..నత్వానీ మాట నిలబెట్టుకుంటారా..
ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఆశలతో నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. అంబానీ సీఎం జగన్ తో సమావేశమైన సమయంలో ఏపీలో పెట్టుబడుల దిశగా హామీ ఇచ్చారు. నత్వానీ సైతం తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ ఖరారు కాగానే..ట్విట్టర్ ద్వారా అభయం ఇచ్చారు. దీంతో పాటుగా..అంబానీ..నత్వానీ వంటి వారు సహకారం అందిస్తే తన మీద ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పెట్టుబడుల విషయంలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి ముగింపు లభిస్తుందని జగన్ అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక, నత్వానీ సైతం అటు రాజకీయంగా..పారిశ్రామికంగా ఏదైనా మేనేజ్ చేయగలిగిన వ్యక్తి కావటంతో ఆయనతో సత్సంబంధాలు అవసరమని జగన్ భావించారు. ఇదే సమయంలో అమిత్ షా స్వయంగా కోరటంతో దానిని కూడా జగన్ తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేసారు. ఇక, ఇప్పుడు అంబానీ..నత్వానీ ఏపీ సీఎంకు ఇచ్చిన హామీలు ఎంత వరకు నిలబెట్టుకుంటారు.. ఏ మేర జగన్ కు సహకరిస్తారనే ఆసక్తి కర చర్చ సాగుతోంది.