సీఎం జగన్ కు నవయుగ రివర్స్ షాక్ : రద్దు ఏకపక్షం : హైకోర్టుకు చేరిన వ్యవహారం..!!
ఊహించిందే జరిగింది. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు...జల విద్యుత ప్రాజెక్టు పైన తీసుకుంటున్న నిర్ణయాలు రివర్స్ అవుతాయని అనేక మంది ఆందోళన వ్యక్తం చేసారు. పనుల నుండి నవయుగ సంస్థ ను తప్పిస్తూ నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం..రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో..రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ దాకా వేచి చూసిన నవయగ సంస్థ..ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయగానే తమను తప్పించటం పైన హైకోర్టును ఆశ్రయించింది. జలవిద్యుత్తు ప్రాజెక్ట్ కాంట్రాక్టు రద్దు ఉత్తర్వులను కొట్టేయాలని..ఇతరులకు పనులు అప్పగించకుండా నిలువరించాలని అభ్యర్ధించింది. దీని పైన హైకోర్టు ఈ రోజు విచారణ చేయనుంది. దీంతో..ఇప్పుడు మొత్తంగా పోలవరం న్యాయ పరమైన చిక్కుల్లో పడుతుందా..మరో వైపు కేంద్రం సైతం ఈ వ్యవహారం పైన నివేదిక కోరింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఏం జరగబోతోంది..పోలవరం భవిష్యత్ ఏంటి..
హైకోర్టును ఆశ్రయించిన నవయుగ
పోలవరం నిర్మాణ పనులతో పాటుగా ..పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు (పీహెచ్ఈపీ) పనుల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆగస్టు 14న ఏపీ జెన్కో (హైడల్ ప్రాజెక్ట్స్) చీఫ్ ఇంజినీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని అభ్యర్థించింది. తమతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పైన కొద్ది రోజులుగా నవయుగ మౌనం పాటించింది. ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఎదురు చూసిన నవయుగ..ఇప్పుడు రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ అయిన తరువాత న్యాయ పోరాటానికి సిద్దమైంది. తన పిటీషన్ లో ఒప్పందం పూర్వా పరాలను వివిరించింది. ‘80 మెగావాట్ల సామర్థ్యంతో 12 హైడ్రో పవర్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఏపీ జెన్కోతో 2017 డిసెంబర్ 20న ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందంలో భాగంగా పలు పనులు నిర్వహించాల్సి ఉంది. కాంట్రాక్ట్ విలువ రూ.3220.28 కోట్లు. ఒప్పందం ప్రకారం స్థలం అప్పగించినప్పటి నుంచి 40 నెలల్లో మొదటి మూడు యూనిట్లను పూర్తి చేయాలి. మిగిలిన 9 యూనిట్లను రెండు నెలలకొకటి చొప్పున మొత్తం 18 నెలల్లో పూర్తి చేయాలి. ఒప్పంద తేదీ నుంచి ఎలాంటి లోపం జరగకుండా మా బాధ్యతలు నెరవేరుస్తున్నామని కోర్టుకు నవయుగ సంస్థ నివేదించింది.
ఒప్పందం రద్దుకు కారణాలు చెప్పలేదు..
ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత తమ ఒప్పందం విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. పనులు రద్దు చేస్తూ తమకు నోటీసులు ఇచ్చారని వివరించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ జులై 19న లేఖ పంపుతూ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు.. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పనులు సహా అన్ని పనుల్ని తక్షణం నిలిపేయాలని కోరారన్నారు. ఒప్పందంలో తాము ఏం ఉల్లంఘించామో చెప్పలేదని, రద్దుకు కారణాలేమిటో వివరించలేదని వ్యాజ్యంలో ఆక్షేపించారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు నిబద్ధతతో ఉన్నామని, ఇప్పటి వరకు రూ.398 కోట్లు ఖర్చు చేశామంటూ చీఫ్ ఇంజినీర్ లేఖకు సమాధానం కూడా పంపామన్నారు. ఒప్పందాన్ని రద్దు చేస్తే భారీ నష్టం వాటిల్లుతుందని చెప్పినా పట్టించుకోలేదన్నారు. రివర్స్ టెండరింగ్ కోసమే ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేశారని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రీటెండరింగ్కు ప్రాతిపదిక కన్పించడం లేదని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో.. జలవనరుల శాఖకు లేఖ కూడా రాశారన్నారు. అథారిటీ తగు నిర్ణయం తీసుకునే వరకైనా ప్రక్రియను వాయిదా వేయాలని కోరారనే విషయాన్ని సైతం నవయుగ తన పిటీషన్ లో వివరించింది. దీని పైన కోర్టు జరిపే విచారణలో పూర్తి ఆధారాలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం ఈ పరిణామం ముందుగానే ఊహించామని..ప్రభుత్వ అధికారాలకు లోబడే నిర్ణయాలు ఉన్నాయని వాదిస్తోంది.
పోలవరం భవితవ్యం ఏంటి..
నవయుగ తన పిటీషన్ లో ఒక అంశాన్ని స్పష్టం చేసింది. ఏపీ జెన్కోకు మాకు మధ్య ఒప్పందం జరిగింది. కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర సర్కారు మూడో పార్టీ మాత్రమే. ఒప్పందాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏపీ జెన్కో కట్టుబడాల్సిన అవసరం లేదు. మేం పనులు చేయాల్సిన చోట రాళ్లు తొలగించి స్థలాన్ని అప్పగించాల్సిన బాధ్యత జెన్కోపై ఉన్నా వారు పట్టించుకోలేదు. ఒప్పంద రద్దు ఉత్తర్వుల వెనుక దురుద్దేశం ఉంది. ఆ ఉత్తర్వులు చట్టవిరుద్ధం. యంత్రాలు సమకూర్చుకొనేందుకు, సబ్ వెండర్లకు, ఇతరులకు ఇప్పటికే భారీగా చెల్లించాం. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఒప్పందం రద్దు చేస్తూ ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ ఆగస్టు 14న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయండి. ఆ కాంట్రాక్టు పనులు కొనసాగించేందుకు మాకు అనుమతించండి. పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్ట్ పనుల్ని ఇతరులకు అప్పగించకుండా ఆదేశించండంటూ అభ్యర్ధించింది. అయితే, ఒక వైపు కేంద్ర ప్రభుత్వం..పీపీఓ..నవయగ..ఏపీ ప్రభుత్వం మధ్య సమన్వయంతో ముందుకు సాగాల్సిన సమయంలో ీ వ్యవహారం కోర్టుకు చేరటంతో..పోలవరం భవితవ్యం ఏంటనే ఆందోళన మొదలైంది. ఈ రోజు కోర్టులో విచారణ ఉండటంతో..ఇది ఎటు వైపు టర్న్ అవుతుదందనే చర్చ మొదలైంది.