రాజధానిపై టీజీ వెంకటేష్ వ్యాఖ్యల కలకలం ... నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు అంటూ షాకింగ్ కామెంట్స్
ఇటీవల రాయలసీమలోని కర్నూల్ ని దేశానికి రెండవ రాజధాని చెయ్యాలని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. దేశానికి రెండవ రాజధాని అవసరం ఉందన్న ఆయన.. కర్నూల్ ని క్యాపిటల్ గా అనౌన్స్ చెయ్యాలని చేసిన వ్యాఖ్యలు మరచిపోకముందే ఏపీ రాజధాని విషయంలో టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీడీపీను వీడి బీజేపీలోకి వెళ్లిన ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
బొత్సా వ్యాఖ్యల దుమారం .. రాజధాని విషయంలో విపక్షాలు ఫైర్
వైసీపీకి చెందిన మంత్రి బొత్సా రాజధాని విషయంలో చేసిన ప్రకటనతో, దానిని సమర్ధించిన వైసీపీ నేతల మాటలతో రాజధాని అంశం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. వైసిపి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. దీనిపై ఆదివారం ఆయన క్లారిటీ ఇస్తూ మరోసారి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. వరదలొస్తే రాజధాని పరిస్థితి ఏంటి అని బొత్సా మరోమారు ప్రశ్నించారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని అమరావతి నుంచి దొనకొండ తరలిపోతుందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ అధినేత దీనిపై స్పందించే వరకు ఎవరూ ఎలాంటి మాటలు నమ్మాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనన్న టీజీ వెంకటేష్
ఇక మరోపక్క రాజధాని అంశంపై బీజేపీ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమరావతి గురించి మాట్లాడుతూ రాజధాని మార్పు విషయంలో బిజెపి జోక్యం చేసుకోదని చెప్పారు. ఇక తాజాగా నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు . అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని చెప్పిన ఆయన ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని కూడా పేర్కొన్నారు.ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్యూలో మాట్లాడుతూ రాష్ట్రంలోని విజయనగరం, గుంటూరు, కాకినాడ, కడప జిల్లాలను రాజధానులుగా ప్రొజెక్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యాఖ్యలు చేశారు టీజీ. ఈ విషయం బీజేపీ అధిష్ఠానమే తనకు తెలిపిందన్నారు టీజీ వెంకటేష్ . రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో డిప్యూటీ సీఎంలను జగన్ నియమించారన్నారు. రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామంటూ జగన్ ఎన్నికలకు వెళ్లారని అలాంటప్పుడు రాజధాని మారే అవకాశం ఉందని టీజీ కామెంట్ చేశారు.
రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదన్న టీజీ వెంకటేష్ .. జగన్ నిర్ణయమే ఫైనల్ అని వ్యాఖ్య
మంగళగిరిలో సాక్షాత్తూ చంద్రబాబు కుమారుడు లోకేష్ ఓడిపోయారని లోకేష్ ఓటమిపైన కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కమిట్మెంట్ నమ్మి ప్రజలు ఓట్లు వేశారని టీజీ వెంకటేష్ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. కాబట్టి జగన్ ఇప్పటికీ నమ్మక ద్రోహం చేయరని చెప్పొచ్చన్నారు. జగన్ మొండి మనిషి కాబట్టి ఆ స్టాండ్నే కొనసాగిస్తారన్నది తన అభిప్రాయమన్నారు. ఎవరేం చెప్పినా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే స్వాతంత్ర్యం జగన్కు ఉంటుందన్నారు. అధికార పార్టీ వైసీపీ ఆలోచన ప్రకారం నవ్యాంధ్రకు ఒకటి కాకుండా నాలుగు రాజధానులు ఉండే అవకాశం ఉందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.