తప్పించుకున్న నక్సల్స్ కోసం పోలీసుల వేట;ఏవోబీ ముట్టడి:అంతా టెన్షన్...టెన్షన్
విశాఖపట్టణం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఏవోబీలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా తుపాకుల మోతలు, బూట్ల చప్పుళ్లు మార్మోగుతుండటంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనన్న భయంతో అక్కడి నివాసులు గుండెలు చిక్కబట్టుకుంటున్నారు. నక్సల్స్ భారీ ఎన్ కౌంటర్ కు తాము చేసిన ప్రయత్నం ఫెయిలై...మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకుపోవడంతో వారిని ఎలాగైనా మట్టుబెట్టాలన్న పట్టుదల పోలీసు బలగాల్లో పెరిగిపోయినట్లు తెలుస్తోంది.
సోమవారం ఏవోబీలోని వండబ పంచాయతీ టిక్కరపాడు సమీప అడవుల్లో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం కటాఫ్ ఏరియాని ఆంధ్రా, ఒరిస్సా రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎదురు కాల్పుల సమయంలో కొందరు మావోయిస్టులు గాయపడగా, వీళ్లని తీసుకొని మావోయిస్టులు మల్కన్గిరి వైపు తప్పించుకొని పోయినట్లు పోలీసులు సమాచారం లభ్యం అయింది. దీంతో ఒడిసా ఎస్ఓజీ దళాలు మల్కన్గిరి జిల్లా వైపు నుంచి కటాఫ్ ఏరియాలో మాటు వేసి ఉన్నారు.
మావోయిస్టుల సమావేశం...పోలీసుల రంగప్రవేశం...
ఏవోబీలో మావోయిస్ట్ సమావేశం గురించి తెలుసుకున్న ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు, ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్కు ప్రణాళికను రూపొందించాయి. అనుకున్న విధంగా మావోయిస్టుల సమావేశ ప్రాంతానికి చేరువగానే వెళ్లాయి. అయితే అక్కడ ఈ బలగాలను మావోయిస్టు సెంట్రీ పోస్టు గార్డులు గమనించి, తమ నేతలకు సమాచారం చేరవేయడంతో వారు తప్పించుకు పోగలిగారు. అనంతరం మావోయిస్టులు ఖాళీ చేసి వెళ్లిన సమావేశ ప్రాంతానికి పోలీసులు చేరుకొని వారికి చెందిన 54 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో భారీ ఎన్ కౌంటర్...ఇప్పుడు కూడా అలా జరుగుతుందా?...
ఏవోబీలో రామగూడ వద్ద రెండేళ్ల క్రితం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 30 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. ఇప్పుడు కూడా అదే పునరావృతం చెయ్యాలని పోలీసులు పట్టుదలతో ఉండటంతో అత్యంత ఉద్రిక్త వాతావరణం కటాఫ్ ఏరియాలో కనిపిస్తోంది. ఎదురుకాల్పుల సందర్భంగా మావోయిస్టులు గాయపడినట్లు పోలీసులకు స్పష్టంగా తెలియడంతో మల్కాన్ గిరి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని ఆస్పత్రులు, ఆర్ఎంపీలపై పోలీసులు నిఘాఉంచారు. ఆర్ఎంపీ వైద్యుల కదలికలపై కన్నేసి ఉంచడంతో పాటు మెడికల్ దుకాణాల వద్ద మందులు కొనుగోలుకు వస్తున్న వారి గురించి కూడా ఆరా తీస్తున్నారు.
తప్పించుకున్న అగ్రనేతల్లో...ఆర్కే,గాజర్ల రవి ఉన్నారా?
పోలీసుల ఎన్కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకొన్నవారిలో మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. సుమారు ఏడాది కిందట ఏవోబీలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్కే తీవ్రంగా గాయపడి తప్పించుకున్నాడు. ఆ సమయంలో ఆర్కే కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. మళ్లీ ఇప్పుడు కూడా ఈ ఏవోబీలోనే ఒక సమావేశానికి హాజరై తప్పించుకోవడం గమనార్హం. మరోనేత గాజర్ల రవి కూడా రెండేళ్ల క్రితం రామగూడ భారీ ఎన్కౌంటర్ నుంచి కొద్దిలోనే తప్పించుకొనిపోయాడు. రెండు రోజుల క్రితం మావోయిస్టు నేతలు సాకేత్, గోపి, దుబాసి శంకర్ అలియాస్ రమేశ్, ఆర్ఎం, చలపతి అలియాస్ రామచంద్రరెడ్డి, కృష్ణ అలియాస్ కరుణ, గణేశ్, నవీన్ అలియాస్ బోడ అంజయ్యలతో గాజర్ల రవి ఇక్కడే సమావేశం అయినట్లు పోలీసులకు తెలిసింది.
విశాఖ మన్యం వైపు వస్తే...బలగాలు సంసిద్ధం...
ఒకవేళ ఏవోబీ నుంచి తప్పించుకొన్న మావోయిస్టులు విశాఖమన్యం వైపుకు వస్తే వారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్ బలగాలు సంసిద్ధమయ్యాయి. పెదబయలు, ముంచంగిపుట్టు సరిహద్దుల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. మరోవైపు విశాఖ ఎస్పీ రాహుల్దేవ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఎదురుకాల్పుల నుంచి ఆర్కే తప్పించుకున్నాడా? లేదా? అన్నది ఇపుడే చెప్పలేమని అన్నారు...ఘటనా స్థలం నుంచి సేకరించిన కిట్ బ్యాగ్లు మరో 24 గంటల్లో విశాఖకు రానున్నాయని, వాటి ఆధారంగా ఏ స్థాయి నాయకులు ఘటనా స్థలంలో ఉన్నారన్నది తెలియవచ్చని చెప్పారు.