ఆరునుండి 50కి చేరడం హ్యాపీ: గంటా, సరికాదని కన్నా
విశాఖపట్నం/చిత్తూరు: అవిశ్వాస తీర్మానం ఆరుగురి నుండి ప్రారంభమై యాభై మందికి చేరడం సంతోషకరమని మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం విశాఖపట్నంలో అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బే అన్నారు.
బిల్లు అడ్డుకుంటాం: సి రామచంద్రయ్య
అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే తాము అడ్డుకుంటామని మరో మంత్రి సి రామచంద్రయ్య అన్నారు. ఆయన విశాఖ జిల్లాలోని సింహాచలంలో రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లును అడ్డుకుంటామని, తాము సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఎవరికీ ఇబ్బంది లేకుండా: ఎర్రబెల్లి
ఇరు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందరికీ సంతృప్తి కలిగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ఎర్రబెల్లి దయాకర రావు తిరుపతిలో అన్నారు.
ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసం ఏమవుతుందో తనకు తెలియదన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా తెలంగాణ రావాలని తాను శ్రీవారని కోరుకున్నట్లు చెప్పారు.
దురదృష్టకరం: కన్నా
సొంత పార్టీ పార్లమెంటు సభ్యులు యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం దురదృష్టకరమని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గుంటూరులో అన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంచే చర్చించుకోవాలన్నారు. ఇలాంటి చర్యలు మాత్రం సమర్థనీయం కాదన్నారు.